పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన మెరుపు దాడులతో పాకిస్తాన్ వణికిపోయింది. ఆ తర్వాత సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘించి విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతోంది. సైనికులు, సరిహద్దు గ్రామాల ప్రజలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు దిగుతోంది. మరోవైపు.. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి సరిహద్దు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని.. డ్రోన్లు, వైమానిక దాడులకు పాల్పడుతుండగా.. భారత డిఫెన్స్ వ్యవస్థ వాటిని అడ్డుకుంటోంది. మరోవైపు.. పాక్కు చెందిన పలు యుద్ధ విమానాలను కూడా భారత సైన్యం నేలకూల్చింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ సహా సరిహద్దు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగుల సెలవులు రద్దు చేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. పాక్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలైన పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లలో స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్ సహా మొత్తం 27 ఎయిర్పోర్టులు మూతపడటంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఏవైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఢిల్లీ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను సర్కార్ రద్దు చేసింది. నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా మాల్స్, మార్కెట్లు, మెట్రో స్టేషన్లు, హోటళ్లు, రవాణా కేంద్రాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈస్ట్ ఢిల్లీ డీసీపీ అభిషేక్ ధనియా మాట్లాడుతూ.. మయూర్ విహార్ ఫేజ్-1 మెట్రో స్టేషన్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించామని, సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఆ మెట్రో స్టేషన్లో 41 సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేస్తున్నాయని.. ప్రతి షిఫ్ట్లో ఇద్దరు మహిళా సిబ్బందితో సహా 9 మంది సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు భద్రతను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. ఇండియా గేట్ వద్ద ప్రజల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఇది సాధారణ ప్రక్రియ అని.. ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకే ఇలా చేశామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రతి జిల్లా యంత్రాంగం ఆరోగ్య వ్యవస్థలు, విపత్తుల నిర్వహణపై అంతర్గత సమావేశాలు నిర్వహిస్తోంది.
పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడిన నేపథ్యంలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లలో విద్యా సంస్థలను మూసివేశారు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్, బికానెర్, జోధ్పూర్, జైసల్మేర్, బార్మర్ వంటి సరిహద్దు జిల్లాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం, శనివారాల్లో విద్యా సంస్థలు మూతపడగా.. తదుపరి నిర్ణయాన్ని సోమవారం తీసుకుంటామని అధికారులు తెలిపారు. పంజాబ్లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. లడఖ్లోని లేహ్ ప్రాంతంలో 2 రోజుల పాటు పాఠశాలు నిలిపివేశారు. హర్యానాలో పంచ్కులతో సహా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
విమాన రాకపోకలపై ప్రభావం
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, జోధ్పూర్, భుజ్, జమ్మూ వంటి 27 విమానాశ్రయాలను మూసివేశారు. విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలు పెరిగినందున ప్రయాణికులు ముందుగానే చేరుకోవాలని విమాయాన సంస్థలు సూచించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa