భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ.. సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు పర్యాటకుల ప్రాణాలను ఉగ్రవాదులు బలితీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో యావత్ దేశం భగ్గుమంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని.. ముష్కర మూకల ఆగడాలను ఇక తుదముట్టించాలంటూ యావత్ భారతావని బలంగా కోరుకుంది. కోట్లాదమంది భారతీయులు ఉగ్ర చర్యతో రగిలిపోయారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ పని పట్టాలంటూ దేశం మొత్తం నినదించింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పహల్గాం ఉగ్రదాడికి బదులు తీర్చుకుంది భారత్.
అయితే పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత దేశంలోని వివిధ మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు.. సైన్యంలో పనిచేసిన అధికారులు.. కేంద్ర నిఘా సంస్థలలో పనిచేసిన అనుభవం ఉన్నవారిని ఇంటర్వ్యూలు చేశాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. "భారతదేశంలో యుద్ధం చేయడానికి ధైర్యం ఉన్న ఏకైక ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఆవిడ తర్వాత అంత ధైర్యం ఎవరికీ లేదు. ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా అంత ధైర్యవంతుడు కాదు. యుద్ధం చేయాలంటే గట్టి గుండె ఉండాలి. పహల్గాం ఉగ్రదాడి పాకిస్థాన్ చేసిందనే సాక్ష్యాధారాలు లేవు. పహల్గాం ఉగ్ర దాడిలో పాకిస్థాన్ పాత్ర ఉంది కానీ.. అమలు చేసింది మాత్రం ఇక్కడి వారే.. అలాంటప్పుడు పాకిస్థాన్ ఎలా బ్లేమ్ చేస్తాం" అంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడిన ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ ఇంటర్వ్యూలో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో జరిగే తీవ్రవాద ఘటనల్లో పాకిస్థాన్ పాత్ర ఉందన్న నాగేశ్వరరావు.. అయితే 99 శాతం ఘటనల్లో ఇక్కడి వారినే ఉపయోగించుకుంటారన్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగిన ప్రాంతానికి ఎల్వోసీకి 200 కిలోమీటర్ల దూరం ఉంటుందని.. మొత్తం కొండలతో ఉండే ప్రాంతమన్నారు. ఆ దారిలో 200 కిలోమీటర్లు రావాలంటే చాలా కష్టమని.. ఒకవేళ ఉగ్రవాదులు వాహనంలో వచ్చారనుకుంటే.. కశ్మీర్లోని ఐదు లక్షల మంది భద్రతా దళాలు ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. వారు నిజంగానే పాకిస్థాన్ నుంచి వచ్చినట్లైతే.. ఇంత భద్రత మధ్య ఎలా కుదురుతుందన్నారు.
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారు ఇక్కడి వారేనని.. అయితే వారికి పాకిస్థాన్ సహకారం ఉందంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరంతా హోం గ్రౌండ్ టెర్రరిస్టులని అన్నారు. ఇలాంటి వారికి డబ్బు, ఆయుధాల వంటి సహకారం పాకిస్థాన్ నుంచి అందుతూ ఉంటుందని చెప్పారు. మనదేశంలో జరిగే 99 శాతం ఉగ్ర దాడుల ఘటనల్లో హోంగ్రౌండ్ టెర్రరిస్టులే ఉంటారని అన్నారు.1971లో బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత పాకిస్థాన్ ఇలాంటి పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందని ఆయన చెప్పుకొచ్చారు. భారతదేశంలోని ఇస్లామిక్ ఉగ్రవాదులను ఉపయోగించుకుని మనదేశాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa