ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారు డోరు తీయబోతే అడ్డుకున్న మాజీ మంత్రి.. విడదల రజిని వర్సెస్ సీఐ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 06:54 PM

మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కారు వద్ద తోసుకునే వరకూ వ్యవహారం వెళ్లింది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మానుకొండవారి పాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది, మానుకొండవారి పాలెం గ్రామంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు విడదల రజిని వచ్చారు. అయితే విడదల రజినితో పాటుగా ఆమె ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ కూడా కారులో మానుకొండవారి పాలెం వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నాదెండ్ల పోలీసులు విడదల రజిని అనుచరుణ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో విడదల రజినికి పోలీసులకు మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట జరిగాయి.


శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ విడదల రజిని పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసులు బలవంతంగా కారులోని శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. మాజీ మంత్రి అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు సహకరించాలని పోలీసులు చెప్తున్నప్పటికీ.. విడదల రజిని అడ్డుగా రావటంతో, పోలీసులు కాస్త దూకుడుగా వ్యవహరించారు. దీంతో మాజీ మంత్రి మండిపడ్డారు. తాను మాజీ మంత్రినని చెప్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే తమను డ్యూటీ చేయాలని, అడ్డుకుంటే విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేస్తామని.. స్థానిక సీఐ సుబ్బారాయుడు విడదల రజినికి తెలిపారు. పోలీసులు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడం.. విడదల రజిని అడ్డుకోవటానికి యత్నించటంతో మానుకొండవారి పాలెంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.


మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించారని మాజీ మంత్రి విడదల రజినిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విడదల రజిని మరిది గోపీని ఇటీవల పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. విజిలెన్స్‌ తనిఖీల పేరుతో తనను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని యడ్లపాడులోని లక్ష్మీబాలాజి స్టోన్‌ క్రషర్స్ యజమాని అయిన నల్లపనేని చలపతిరావు ఫిర్యాదు చేశారు. చలపతిరావు ఫిర్యాదుఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి విడదల రజిని, విడదల రజిని మరిది గోపి, విడదల రజిని పీఏ రామకృష్ణ, అప్పటి విజిలెన్స్ అధికారి జాషువాలపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో 41ఏ కింద విడదల రజినికీ నోటీసులు అందించి.. ఆ తర్వాత విచారించాలని ఏపీ హైకోర్టు ఇటీవల పోలీసులను ఆదేశించింది. విచారణకు సహకరించాలని విడదల రజినికి హైకోర్టు సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa