భారత్తో యుద్ధానికి పాకిస్థాన్ కావాలనే కాలుదువ్వుతోందని, నిరంతరం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి అన్నారు. ద్వైపాక్షిక చర్చలంటూ ముందుకొచ్చినా, ఉద్రిక్తతలు తగ్గిస్తామని ప్రకటించినా పాకిస్థాన్ను సులువుగా నమ్మకూడదని ఆయన హెచ్చరించారు. ఒకవేళ యుద్ధానికి సిద్ధపడితే పాక్ ఆక్రమిత కశ్మీర్ బలూచిస్థాన్ వంటి కీలక ప్రాంతాలను పాకిస్థాన్ కోల్పోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.పహల్గామ్ లో పర్యాటకులపై మతం అడిగి మరీ ఉగ్రవాదులు దాడి చేయడం పాక్ దుశ్చర్యకు నిదర్శనమని, దీనికి ప్రతిగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' కేవలం ఉగ్ర స్థావరాల నిర్మూలనకే పరిమితమైందని రెడ్డి గుర్తుచేశారు. భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని, కానీ పాకిస్థాన్ మాత్రం ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ, అక్కడి ప్రజల బాగోగులు పట్టించుకోకుండా భారత్పై ఈర్ష్యతో కయ్యానికి దిగుతోందన్నారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రముఠాలను పాక్ తన సైనిక వ్యూహంలో భాగంగా పరిగణిస్తోందని, ఉగ్రవాదులను ముందుంచి సైన్యం వెనకుండి నడిపిస్తోందని విమర్శించారు."పాకిస్థాన్ ఒకవైపు ఉద్రిక్తతలు తగ్గిస్తామని ప్రకటిస్తూనే, మరోవైపు సరిహద్దులకు సైన్యాన్ని తరలిస్తోంది. ఇది మన దృష్టి మరల్చే కుయుక్తే. పాక్ ఎటునుంచైనా దాడి చేసే అవకాశం ఉన్నందున భారత్ ఎల్లప్పుడూ సర్వసన్నద్ధంగా ఉండాలి" అని ఏఆర్కే రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడాలంటే తగ్గాల్సింది పాకిస్థానేనని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. గతంలో భారత్తో తలపడి తూర్పు పాకిస్థాన్ను కోల్పోయిందని, కార్గిల్లోనూ భంగపాటు తప్పలేదని గుర్తుచేశారు. మళ్లీ పాక్ అదే ధోరణి కొనసాగిస్తే పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి భారత్ వెనుకాడదని, బలూచిస్థాన్లో ఇప్పటికే ఉన్న తిరుగుబాటుతో ఆ ప్రాంతం కూడా పాక్ చేజారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత్ సైనికపరంగా శక్తిమంతంగా ఉందని, ప్రజల మద్దతు కూడా ఉందని... పాక్ దుస్సాహసాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa