పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై తీవ్రస్థాయి విరుచుకుపడుతోన్న ప్రతిపక్ష నాయకుల్లో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఒకరు. దొంగదెబ్బ తీసిన పాకిస్థాన్కు గుణపాఠం చెప్పాల్సిందేనని, మరోసారి భారత్వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలని ఉద్ఘాటించారు. తాజాగా, మరోసారి పాకిస్థాన్పై అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని, వారిని చంపే పాకిస్థాన్కు ఆ పేరెత్తే అర్హతలేదన్నారు. అంతేకాదు, పాకిస్థాన్ మాటిమాటికి మజాక్ చేస్తోందని, వాళ్లు దాడిచేస్తే మన సైనికులు తగ్గుతారా? అని వ్యాఖ్యానించారు.
‘‘మన జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలి.. పాకిస్థాన్ మాటిమాటికి మజాక్ చేస్తుంది.. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు.. అమాయకులను, చిన్నపిల్లలను చంపే ఆ దేశానికి ఇస్లాం పేరు పలికే అర్హత లేదు.. అమ్మ కడుపులో నుంచి ఈ భూమిపై పడినప్పుడు.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలి.. ఈ భారతదేశంలో పుట్టడం మా అదృష్టం ’’ అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్పై తరుచూ ఒవైసీ మండిపడుతూ.. కేంద్రానికి పూర్తి మద్తతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు, ‘‘భారత్లో 230 మిలియన్టలకుపైగా ముస్లింలు ఉన్నారనే సత్యాన్ని పాకిస్థాన్ మర్చిపోతోంది.. మా పూర్వీకులు 'రెండు దేశాల సిద్ధాంతం'ను తిప్పికొట్టారు. మేము జిన్నా ప్రతిపాదించిన 'రెండు దేశాల సిద్ధాంతాన్ని' ద్వేషించాం.. తిరస్కరించాం.. మేము భారత్ను మా దేశంగా అంగీకరించాం..ఇక్కడే ఉండాలని తుదిశ్వాస వరకు కొనసాగుతాం.. పాకిస్థాన్ మత ప్రాతిపదికన భారతదేశాన్ని చీల్చాలని చూస్తోంది. భారతీయ ముస్లింలు, హిందువులు, ఇతర సముదాయాల మధ్య విచ్ఛిన్నాన్ని కలిగించాలని ప్రయత్నిస్తోంది...
‘రెండు దేశాల సిద్ధాంతం’ గురించి మాట్లాడుతోన్న పాకిస్థాన్ అఫ్గనిస్థాన్ సరిహద్దు పోస్టులపై ఎందుకు బాంబుల దాడులు చేస్తోంది? ఇరాన్ సరిహద్దు వద్ద ఎందుకు బాంబులు వేస్తోంది? అఫ్గన్లు, ఇరానీయులు ముస్లింలే కదా? పాక్ ప్రభుత్వ విధానం ఇదే ఇస్లాం ముసుగులో తన నేరచర్యలను, ఉగ్రవాద ప్రోత్సాహాన్ని దాచే ప్రయత్నం మాత్రమే... గత 75 సంవత్సరాలుగా పాకిస్థాన్ భారత్పై చేసే కార్యకలాపాలన్నీ ఇదే నాటకం చుట్టూ తిరుగుతున్నాయి’’ అని పాకిస్థాన్పై ఓ రేంజ్లో. ఒవైసీ దుమ్మెత్తిపోశారు. అంతేకాదు, అమెరికా మోస్ట్వాంటెడ్ ఉగ్రవాదలు పాకిస్థాన్లో ఉన్నారన్నారు.
‘‘శ్రీనగర్లోకి డ్రోన్లు వచ్చాయి. సైనికులు మమ్మల్ని ఎలా కాపలా కాస్తున్నారో మాకు తెలియదు.. మేము వారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాం.. ఇకపై పాక్ మన జోలికి రావాలంటనే భయపడాలి.. ప్రపంచానికి ప్రమాదకరమైన దేశానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి... వారి అణు బాంబులను నిరాయుధీకరించాలి... మన రక్షణ దళాలకు మద్దతు ఇవ్వాలి... అమెరికా కోరుతున్న ఉగ్రవాదులకు పాకిస్థాన్ సైన్యం మురీద్కే, బహవల్పూర్లలో ఆశ్రయం కల్పిస్తోంది.. అది నిజమేనని అంటున్నారు! పాక్ ఉగ్రవాదులను కాపాడుతోంది.. ప్రపంచం దీనిని గమనించాలి’ అని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa