ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌ దాడులను తిప్పికొట్టేందుకు సుదర్శన చక్రాన్ని అందించిన మనోహర్ పారికర్

national |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 08:34 PM

గత కొన్ని దశాబ్దాలుగా రక్షణ పరంగా, దేశ భద్రత పరంగా, ఆయుధాలను సమకూర్చుకోవడంలో భారత్.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూనే ఉంది. దేశీయంగానే ఆయుధ సంపత్తిని పెంచుకుంటూనే.. విదేశాల నుంచి కూడా అత్యాధునిక యుద్ధ సామగ్రిని, పరికరాలను కొనుగోలు చేస్తోంది. రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాల నుంచి అత్యాధునిక రక్షణ వ్యవస్థలను దిగుమతి చేసుకునేందుకు కొన్నేళ్లుగా అనేక ఒప్పందాలు చేసుకుంది. అయితే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి అది మరింత పెరిగింది. ఈ క్రమంలోనే రక్షణ ఒప్పందాల్లో ఇతర దేశాల నుంచి ఒత్తిడి వచ్చినా.. వాటిని జయించి.. భారత త్రివిధ దళాలకు అత్యాధునిక ఆయుధాలు, మౌలిక వసతులను కల్పించింది. అయితే ఇటీవల పాకిస్తాన్‌ ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను.. నేలకూల్చేందుకు భారత్‌ ఎస్-400 ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఎస్-400 మిసైల్ సిస్టమ్‌ను భారత సుదర్శన చక్రగా పిలుస్తున్నారు.


రష్యా తయారు చేసిన ఈ సుదర్శన చక్ర ఎస్-400 మిసైల్ సిస్టమ్.. భారత అమ్ములపొదిలోకి చేరేందుకు దివంగత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కృషి ఎంతో ఉంది. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఆయన ముందడుకు వేసి రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ ఎస్-400 క్షిపణి వ్యవస్థ ప్రస్తుతం దేశాన్ని కాపాడుతోంది. అయితే భారత్-రష్యా మధ్య ఈ ఎస్-400 మిసైల్ సిస్టమ్‌ ఒప్పందాన్ని అడ్డుకునేందుకు అమెరికా విశ్వప్రయత్నాలు చేసి ఒత్తిడిని తీసుకువచ్చినా.. వాటిని కాదని ఈ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. ఈ ఎస్-400 ట్రయంఫ్ ప్రపంచంలోనే అత్యుత్తమ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది 600 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అనేక వైమానిక లక్ష్యాలను గుర్తించి.. వాటిని అడ్డుకోగలదు. అంతేకాకుండా ఒకేసారి 80 లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంటుంది.


2018లో రష్యాతో భారత్ కుదుర్చుకున్న రూ.35 వేల కోట్ల ఒప్పందంలో భాగంగా ఇప్పటికే 3 ఎస్-400 స్క్వాడ్రన్‌లు మన దేశానికి చేరుకున్నాయి. ఈ ఏడాదిలోనే మరిన్ని ఈ క్షిపణి వ్యవస్థలను రష్యా భారత్‌కు డెలివరీ కానున్నాయి. అయితే గత 3 ఏళ్లుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మరో 2 ఎస్-400 స్క్వాడ్రన్‌ల రాక 2026-27 వరకు ఆలస్యం కావచ్చని రక్షణ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో సుదర్శన చక్రగా పిలిచే ఈ ఎస్-400 క్షిపణి వ్యవస్థను.. వ్యూహాత్మకంగా దేశానికి ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో మోహరించారు. ఇది యుద్ధ విమానాలు, డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల వంటి అనేక రకాల వైమానిక దాడులను ముందే గుర్తించి, ట్రాక్ చేసి మరీ నేల కూల్చగలదు. ఈ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి పూర్తి వివరాల కోసం ఈ కథనం చదవండి.


అయితే ఈ ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలని పదేళ్ల క్రితమే భారత రక్షణ శాఖ చేసిన ప్రణాళికల ఫలితంగానే ఈ అత్యాధునిక డిఫెన్స వ్యవస్థ మనకు అందుబాటులోకి వచ్చింది. 2016లో రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ చొరవతో ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ వ్యూహాల్లో సమూల మార్పులు తీసుకువచ్చారు. ఆయన ముందుచూపుతోనే భారత్‌కు ఈ సాంకేతికంగా అత్యాధునికమైన ఎస్-400 వ్యవస్థ వచ్చి చేరింది. అయితే ఈ ఎస్-400 ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్‌ను రష్యా నుంచి కొనుగోలు చేయకుండా భారత్‌పై అమెరికా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చింది. ఆ ఒత్తిడిని దాటుకుని మరీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు ఈ ఒప్పందాన్ని ముగించి ఆ సుదర్శన చక్రను భారత వైమానిక దళానికి అందించారు. తాజాగా పాక్ చేస్తున్న దాడుల నేపథ్యంలోనే.. దేశ ప్రజలు మనోహర్ పారికర్ చేసిన కృషిని కొనియాడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa