భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణపై ఒప్పందం కుదరడంతో ఐపీఎల్ 2025 పునఃప్రారంభమానికి లైన్ క్లియర్ అయినట్లయింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలతో శుక్రవారం బీసీసీఐ.. ఐపీఎల్ను వారం పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో భారత క్రికెట్ ఫ్యాన్స్.. నిరాశ వ్యక్తం చేశారు. అయితే భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల క్రీడాకారులంతా మద్దతు తెలిపారు.
అయితే ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి వచ్చే వారం ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. త్వరలోనే ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానుందని తెలుస్తోంది. వారం పాటు వాయిదా వేయాలని బీసీసీఐ తొలుత నిర్ణయించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే ముందుగానే మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్ల నిర్వహణపై బీసీసీఐ ఇప్పటికే దృష్టి సారించింది. ఇప్పటికే మూడు వేదికలను ఖరారు చేసినట్లు తెలిసింది. మిగిలిన 16 మ్యాచ్లను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వేదికగా నిర్ణయించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఆటగాళ్లకు ఇబ్బంది లేకుండా.. వీలైనంత తక్కువ రోజుల్లో టోర్నీని ఫినిష్ చేయాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది.
ప్రస్తుతం లీగ్ స్టేజ్లో 12, ప్లే ఆఫ్స్లో 4 కలిపి మొత్తం 16 మ్యాచ్లు జరగాల్సి ఉంది. మధ్యలోనే ఆగిపోయి రద్దు అయిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను కూడా మళ్లీ ఆడించాలని భావిస్తే.. మొత్తం 17 మ్యాచ్లు మిగిలి ఉంటాయి. లీగ్ స్టేజ్లో మిగిలిన 12 మ్యాచ్లను ఆరు రోజల్లో పూర్తి చేసి.. ప్లే ఆఫ్స్ను నాలుగు రోజుల్లో ముగించాలని ఐపీఎల్ నిర్వహకులు భావిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పాయింట్స్ టేబుల్లో టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు వెళతాయి. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa