ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలు.. పాక్ దాడులకు భారత్ గట్టిగా ఇస్తున్న ప్రతిదాడులు, ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ఏ రోజుకు ఆ రోజు.. భారత త్రివిధ దళాల అధికారులు మీడియాకు సమాచారం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కూడా అధికారులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్.. ఒక్కసారిగా అందర్నీ కొద్దిసేపు క్రికెట్ ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాక్ దాడులను సమర్థవంతంగా అడ్డుకుని తిప్పికొడుతున్న భారత డిఫెన్స్ వ్యవస్థను క్రికెట్ మ్యాచ్తో పోల్చడంతో అంతా అవాక్కయ్యారు. రన్ మెషీన్, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇవాళ రిటైర్మెంట్ అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
సోమవారం జరిగిన మీడియా సమావేశంలో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మొదట.. టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. "ఈ రోజు టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. చాలా మంది లాగే నేను కూడా ఆయనకు వీరాభిమానిని. కాబట్టి ఇప్పుడు మనం క్రికెట్ గురించి మాట్లాడుకోవచ్చు" అంటూ లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా 1970లలో జరిగిన ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ను గుర్తు చేసుకున్నారు. భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉందో చెప్పేందుకు మాత్రమే ఆయన టెస్ట్ మ్యాచ్ను గుర్తు చేసుకోవడం గమనార్హం.
ఇక ఆ ఆసీస్-ఇంగ్లండ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు జెఫ్ థామ్సన్, డెనిస్ లిల్లీల భీకర బౌలింగ్తో భారత డిఫెన్స్ వ్యవస్థను పోల్చారు. తాను స్కూల్లో చదువుకున్న రోజుల్లో థామ్సన్, లిల్లీ బౌలింగ్ ద్వయం ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ మొత్తాన్ని ఊచకోత కోశారని గుర్తు చేసుకున్నారు. ఆ మ్యాచ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. "యాషెస్ టు యాషెస్.. డస్ట్ టు డస్ట్.. థామ్సన్కి దొరక్కపోతే.. లిల్లీకి చిక్కాల్సిందే" అని పేర్కొందని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ అప్పటి విషయాన్ని మీడియాకు వివరించారు.
థామ్సన్, లిల్లీ లాగే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్తాన్పై భారత్ చూపిస్తున్న ఆధిపత్యాన్ని కూడా ఉదాహరణగా చూపించవచ్చని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న దాడులకు.. భారత్ చేస్తున్న ప్రతి దాడులను ఆ మ్యాచ్తో పోల్చవచ్చని వెల్లడించారు. ఈ క్రమంలోనే భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత బలంగా ఉందో అనేది చెప్పారు. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లోని మల్టీ లేయర్ సిస్టమ్ కూడా పాకిస్తాన్ ఎన్ని దాడులు చేసినా వాటన్నింటినీ పటాపంచలు చేస్తుందని వివరించారు. ఒక లేయర్లో మిస్ అయినా మరో లేయర్.. దాని నుంచి తప్పించుకున్నా మరో దాంట్లో చిక్కక తప్పదు అని పేర్కొన్నారు. ఈ గ్రిడ్ సిస్టమ్లోని ఒక్కో లేయర్ శత్రువుల ఆయుధాలను నాశనం చేస్తుందని.. మన ఎయిర్ డిఫెన్స్ అంత శక్తివంతమైందని మరోసారి తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa