పంజాబ్లోని ఆదంపుర్ వైమానిక దళ స్థావరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. అక్కడ సైనికులను ఉద్దేశించి ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత సైన్యం కృతనిశ్చయంతో ఉందని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మన డ్రోన్లు, క్షిపణులు శత్రువులను మట్టికరిపించిన వేళ 'భారత్ మాతాకీ జై' నినాదం వారి చెవుల్లో మార్మోగిందని అన్నారు.'భారత్ మాతాకీ జై' నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని, ఈ నినాదం శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తోందని వ్యాఖ్యానించారు.భారత సైన్యం కనబరిచిన అసామాన్య ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ, ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని మన సేనలు ప్రతిన బూనాయని తెలిపారు. "మన సైన్యం కనబరిచిన శక్తిసామర్థ్యాలకు ఎన్ని ప్రశంసలు చేసినా తక్కువే. అణ్వస్త్రాల ద్వారా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నాలను మన సైన్యం అపహాస్యం చేసింది. భారత శక్తిసామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది" అని ఆయన పేర్కొన్నారు. యుద్ధక్షేత్రంలో కూడా ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు మార్మోగాయని, ఆకాశం నుంచి పాతాళం వరకు ఈ నినాదం ప్రతిధ్వనించిందని అన్నారు. ఈ పవిత్ర భూమి నుంచి వీర సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్నానని ప్రధాని అన్నారు."మీ పరాక్రమంతో 'ఆపరేషన్ సిందూర్' నినాదం ప్రపంచమంతా మార్మోగుతోంది. ప్రతి భారతీయుడు సైన్యానికి అండగా నిలబడ్డాడు. భారత సేనలకు యావత్ దేశం కృతజ్ఞతలు తెలియజేస్తోంది" అని మోదీ ప్రశంసించారు. ధర్మసంస్థాపన కోసం ఆయుధం ధరించడం మన సంప్రదాయమని, అదే మన విధానమని ఆయన ఉద్ఘాటించారు.దేశ భద్రత విషయంలో, ముఖ్యంగా మహిళల గౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. "మన అక్కాచెల్లెళ్ల నుదుటి సిందూరం తుడిచిన దుర్మార్గులను, వారి నట్టింట్లోకి చొరబడి మరీ నాశనం చేశాం" అని ఆయన ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa