భారత సాయుధ బలగాలు పాకిస్థాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' విజయం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నాడు చేసిన ప్రసంగం, పాకిస్థాన్కు ఆయన జారీ చేసిన హెచ్చరికలు ఇరు దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధానికి దారితీశాయి. మోదీ వ్యాఖ్యలను 'రెచ్చగొట్టేవి, వివాదాస్పదమైనవి'గా పేర్కొంటూ పాకిస్థాన్ ప్రభుత్వం నేడు తీవ్రంగా ఖండించింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, 'ఆపరేషన్ సిందూర్'ను విజయవంతంగా పూర్తిచేసిన భారత సాయుధ బలగాలను అభినందించారు. ఈ ఆపరేషన్లో కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని, డజన్ల కొద్దీ ఉగ్రవాదులు హతమయ్యారని, 'అత్యంత కీలక' లక్ష్యాలు అనదగ్గ కొందరు ఉగ్రవాదులు కూడా మృతుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. పాకిస్థాన్పై ప్రతీకార చర్యలను భారత్ కేవలం విరామం ఇచ్చిందని, పూర్తిగా ముగించలేదని మోదీ గట్టిగా హెచ్చరించారు. కాల్పుల విరమణకు తొలుత ఇస్లామాబాదే కాళ్లబేరానికి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. "ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవు, ఉగ్రవాదం, వాణిజ్యం ఒకేసారి నడవవు, అలాగే నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు" అని మోదీ స్పష్టం చేశారు.ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. "భారత ప్రధాని చేసిన రెచ్చగొట్టే, వివాదాస్పద వ్యాఖ్యలను పాకిస్థాన్ తిరస్కరిస్తోంది" అని రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపింది. "ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ కట్టుబడి ఉంది. ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం" అని పేర్కొంది. "భారత్ కూడా ప్రాంతీయ స్థిరత్వానికి, తమ పౌరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తుందని ఆశిస్తున్నాం" అని పాక్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరిగినా పూర్తిస్థాయిలో ప్రతిఘటిస్తామని కూడా హెచ్చరించింది.మంగళవారం నాడు కూడా ప్రధాని మోదీ పాకిస్థాన్కు మరో తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో వైమానిక దళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, భారత్లో మరో ఉగ్రదాడికి పాకిస్థాన్ అనుమతిస్తే మట్టికరవక తప్పదని హెచ్చరించారు. "భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుంది, కానీ దాడి జరిగితే శత్రువును తుదముట్టించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది" అని మోదీ ఉద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa