ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే ప్రపంచ పటంలో పాక్ ఉనికి గల్లంతని వ్యాఖ్య

national |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 06:54 AM

భారత్‌తో కవ్వింపు చర్యలకు పాల్పడితే ప్రపంచ పటంలో పాకిస్థాన్ తన ఉనికిని కోల్పోవాల్సి వస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరించారు. ఇటీవల పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత సైన్యం శౌర్యాన్ని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమను ఆయన కొనియాడారు.ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం అంబికాపుర్‌లో నిర్వహించిన ‘మోర్‌ ఆవాస్‌ మోర్‌ అధికార్‌’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, "పహల్గామ్ ఘటనకు ప్రతిగా భారత సైన్యం 'ఆపరేషన్‌ సిందూర్‌' చేపట్టి పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. మన సైనిక బలగాల ధీరత్వానికి, ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రతి ఒక్కరూ సెల్యూట్‌ చేయాలి" అని ఆయన అన్నారు.భారత్ ఎవరితోనూ కయ్యానికి దిగదని, అయితే తమ జోలికి వస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోదని 'ఆపరేషన్ సిందూర్‌' ద్వారా స్పష్టం చేశామని పేర్కొన్నారు. "మన ఆడబిడ్డల సిందూరం తుడిచిన వారిని వారి నట్టింట్లోకి వెళ్లి నాశనం చేయడం దేశ శౌర్యానికి నిదర్శనం" అని ఆయన వ్యాఖ్యానించారు.ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం భారత సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని తెలిపారు. ఈ కారణంగానే దాయాది దేశం పన్నుతున్న కుట్రలను మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతోందని ఆయన వివరించారు.ఇదే కార్యక్రమంలో కేంద్రమంత్రి 'ఒకే దేశం ఒకే ఎన్నిక' ఆవశ్యకతపైనా తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలో తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల ప్రభుత్వాలపై ఆర్థిక భారం అధికంగా పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు కూడా 'ఒకే దేశం ఒకే ఎన్నిక' విధానానికి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో ముందుకు తెచ్చిన ఈ బృహత్తర కార్యక్రమం దేశానికి ఎంతో మేలు చేస్తుందని ప్రశంసించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa