పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలు, వారి ముఖ్య కేంద్రాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్తో మెరుపు దాడులు చేసింది. అయితే, ఆపరేషన్ సిందూర్పై పాక్ తప్పుడు ప్రచారానికి వంతపడుతోన్న చైనా, టర్కీలకు భారత్ ఝలక్ ఇచ్చింది. తప్పుడు సమాచారం ప్రచురించిందని ఆరోపిస్తూ చైనాకు చెందిన ప్రభుత్వ మీడియా సంస్థలైన గ్లోబల్ టైమ్స్, జిన్హువా న్యూస్ ఏజెన్సీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలను భారత్తో నిషేధించింది. గ్లోబల్ టైమ్స్ చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ డైలీకి అనుబంధంగా పనిచేసే ఇంగ్లీష్ వార్తా పత్రిక కాగా.. జిన్హువా చైనా అధికారిక వార్తా సంస్థ. ఇటీవలే బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం గ్లోబల్ టైమ్స్ వార్తలపై తీవ్రంగా స్పందించిన తరవాత ఈ నిర్ణయం వెలువడింది.
ఆపరేషన్ సిందూర్పై చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ తప్పుడు సమాచారం ప్రచురించడంపై భారత్ తీవ్రంగా ఖండించింది. ‘‘గ్లోబల్ టైమ్స్ ఈ విధమైన తప్పుడు సమాచారం ప్రచురించే ముందు మీరు వాస్తవాలను నిర్ధారించుకోవాలి.. మీ మూలాలపై సవాల్ చేయాలని మేము సలహా ఇస్తున్నాం’ అని బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా X (ట్విట్టర్)లో పేర్కొంది.
అలాగే, టర్కీ అధికారిక మీడియా సోషల్ మీడియాపై కూడా నిషేధం విధించింది. టర్కిష్ బ్రాడ్కాస్టర్ 'TRT వరల్డ్' ఎక్స్ ఖాతాను బ్యాన్ చేసింది. ఉద్రిక్తతల సమయంలో భారత్పై పాకిస్థాన్ టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లతో దాడిచేసినట్టు సైన్యం నిర్దారించింది. ఇప్పటికే అజర్బైజాన్, టర్కీ ప్రయాణాలపై అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు బుకింగ్లు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. పాకిస్తాన్కు మద్దతు తెలుపుతున్న టర్కీ, అజర్బైజాన్లకు.. ఒకవేళ భారతీయులు ఎవరైనా వెళ్లాల్సి వస్తే అక్కడి సున్నితమైన ప్రాంతాల పర్యటనల్లో చాలా అలర్ట్గా ఉండాలని సూచించాయి.
అటు, పుణేలోని వ్యాపారులు టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న యాపిల్స్ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. టర్కీ, పాకిస్థాన్కు మద్దతు తెలుపుతోందని, ఉగ్రవాదానికి ప్రోత్సాహం అందిస్తోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉగ్రవాదంపై మనం పోరాడుతుంటే, టర్కీ మాత్రం పాకిస్థాన్కు డ్రోన్లను సరఫరా చేసిందని, తద్వారా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న 9 ప్రదేశాల్లో 24 ఖచ్చితమైన క్షిపణి దాడులు చేసింది. కానీ పాకిస్థాన్కు అనుంగు మిత్రుడైన చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ మాత్రం పాత ఫోటోలతో భారత్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ కూల్చేసిందని తప్పుడు కథనాలను ప్రచురించిందని భారత రాయబార కార్యాలయం వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa