ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20 రోజుల తర్వాత ,,,,బీఎస్ఎఫ్ జవాన్‌ను విడుదల చేసిన పాక్

national |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 08:05 PM

పొరపాటున సరిహద్దులు దాటిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్‌ పూర్ణం కుమార్ సాహును పాకిస్థాన్ విడుదల చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం 20 రోజుల కిందట సరిహద్దుల్లో పాక్ భూబాగంలోకి ప్రవేశించిన సాహును పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అటారీ సరిహద్దు వద్ద భారత సైనికాధికారులకు పూర్ణం కుమార్ సాహును పాక్ అదికారులు బుధవారం (మే 14న ) అప్పగించారు. కొన్నిసార్లు పొరపాటున సరిహద్దులు దాటి.. భారత జవాన్లు పాక్ భూభాగంలోకి వెళ్లడం.. పాక్ రేంజర్లు భారత భూభాగంలోకి రావడం సర్వసాధారణమే. అలాంటి సందర్భాల్లో ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు చర్చలు జరిపి.. ఎవరి సైనికులను వారి భూభాగంలోకి పంపిస్తూ ఉంటారు. కానీ, జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో పూర్ణం కుమార్ సాహును పాక్ వదిలిపెట్టకుండా తాత్సారం చేసింది.


పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ప్రాంతంలో విధుల్లో ఉన్న పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ సాహు.. స్థానికంగా ఉండే రైతుల పంటలకు గస్తీ నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే, ఏప్రిల్ 23న బుధవారం రోజు కూడా కొంత మంది రైతులకు గస్తీ కాస్తున్న ఆయన.. ఎండ వేడికి తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సమీపంలో ఓ చెట్టు కనిపించడంతో అక్కడకు వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. వెంటనే నడుచుకుంటూ వెళ్లి పడుకున్నారు. అయితే అది పాక్ భూభాగం కావడం.. పాక్ రేంజర్లు ఆ విషయాన్ని గుర్తించడంతో బీఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.


వెంటనే సాహును వదిలిపెట్టాలని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్. పాక్ రేంజర్స్ మధ్య జరిగిన ఫ్లాగ్ మీటింగ్‌లో కోరారు. పొరపాటున భారత భూభాగం నుంచి పాక్ భూభాగంలోకి అడుగు పెట్టాడని.. అతడ్ని వదిలేయాలని బీఎస్ఎఫ్ అధికారులు..సూచించారు. కానీ, పాక్ రేంజర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించడంతో సాహు విడుదల మరింత జాప్యమైంది.


గర్బవతి అయిన జవాన్ భార్య రజని షాహు.. సహా కుటుంబం మొత్తం అతడి యోగక్షేమాలపై ఆందోళన చెందింది. మా బిడ్డ ఎప్పుడు తిరిగొస్తాడని.. అతడు క్షేమంగా ఉన్నాడా? అని అనుమానం వ్యక్తం చేశారు. తన భర్త క్షేమంగా తిరిగి రావాలని అతడి భార్య రజని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆమె కోల్‌కతా నుంచి పఠాన్‌కోట్‌కు వెళ్లి అధికారులను కలిసి తన భర్త గురించి మాట్లాడారు. కుమార్ సాహు త్వరగా విడుదల అవుతారని అధికారులు హామీ ఇవ్వడంతో రజని తిరిగి కోల్‌కతాకు వెళ్లిపోయారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa