ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగారం ధరల్లో ఊహించని మార్పు

business |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 11:33 PM

కొద్ది రోజుల కిందటి వరకు.. బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఒకవైపు.. అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించడం.. మరోవైపు భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతలు, అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం.. ఆర్థిక మాంద్యం భయాలు ఇలా ఇన్ని కారణాలతో అనిశ్చితి నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ పెరిగి రేట్లు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఆల్ టైమ్ గరిష్టాలకు దూసుకెళ్లాయి. ఒక దశలో ఇంటర్నేషనల్ మార్కెట్లో.. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10 గ్రాములు) ఏకంగా 3500 డాలర్లపైకి చేరింది. అయితే.. ఇటీవల బంగారం ధరలు వరుసగా బ్రేకులు పడుతున్నాయి. భారీగా దిగొస్తున్నాయి. ఇక బుధవారం రోజు మరింత భారీగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ తగ్గుదల ప్రభావం.. గురువారం ఉదయం భారత మార్కెట్లో కనిపిస్తుందని చెప్పొచ్చు. దేశీయంగా బుధవారం రోజు ఉదయం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 500 తగ్గి తులం 88,050 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ రేటు 10 గ్రాములు రూ. 96,060 వద్ద ఉంది.


అమెరికాలో ఏప్రిల్ నెలలో ఊహించిన దానికంటే తక్కువగా ద్రవ్యోల్బణం నమోదు కావడం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం సహా పలు దేశాలతో ట్రంప్ ఒప్పందాలు చేసుకుంటుండటం.. దూకుడు తగ్గించడం.. ఇలా పలు కారణాలతో.. బుధవారం.. పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ రేటు బుధవారం ఉదయం ఒక దశలో ఔన్సుకు 3250 డాలర్లపైన ట్రేడవగా.. ఇప్పుడు వార్త రాస్తున్న సమయంలో (బుధవారం రాత్రి 9.30 గంటలకు) ఇది 3170 డాలర్ల దిగువకు చేరింది. ఈ క్రమంలోనే 12 గంటల వ్యవధిలోనే ఏకంగా 80 డాలర్లకుపైగా తగ్గడం గమనార్హం.


బంగారం ధరలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా అమెరికా-చైనా టారిఫ్ ఒప్పందం, ద్రవ్యోల్బణం తగ్గడం, ప్రపంచ ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఉన్నాయి. ఆగ్‌మొంట్ రీసెర్చ్ హెడ్ రేనిషా చైనాని మాట్లాడుతూ, అమెరికా- చైనా టారిఫ్‌లను గణనీయంగా తగ్గించడానికి అంగీకరించిన తర్వాత బంగారం ధర దాదాపు నెల రోజుల కనిష్ట స్థాయికి పడిపోయిందని అన్నారు. వాణిజ్య చర్చల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని ఆమె అభిప్రాయపడ్డారు. "అమెరికా ఏప్రిల్ వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గడం వల్ల, అమెరికా డాలర్‌పై ఒత్తిడి తగ్గింది. టారిఫ్‌ల తక్షణ ప్రభావం తక్కువగా ఉంది.'' అని చైనాని తెలిపారు.


ద్రవ్యోల్బణం మందగించడంతో, 2025 చివరి నాటికి వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని మార్కెట్లు భావిస్తున్నాయి. బంగారం వడ్డీని ఇవ్వదు కాబట్టి, తక్కువ వడ్డీ రేట్లు సాధారణంగా బాండ్‌లు లేదా సేవింగ్స్ ఖాతాలతో పోలిస్తే బంగారాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.


అమెరికా- చైనా మధ్య ఉద్రిక్తతలు చల్లారుతున్నట్లు కనిపిస్తోంది. స్విట్జర్లాండ్‌లో జరిగిన వారాంతపు సమావేశం వాణిజ్య చర్చల్లో పురోగతికి దారితీసింది. అంతేకాకుండా, అమెరికా విధించిన కొత్త టారిఫ్ రేట్లు ఊహించిన దానికంటే తక్కువగా ఉన్నాయి. ఇది సురక్షిత పెట్టుబడి అయిన బంగారం పట్ల ఇన్వెస్టర్ల ఆసక్తిని తగ్గించింది.


గ్లోబల్ ఎక్స్ ఈటీఎఫ్స్ విశ్లేషకుడు జస్టిన్ లిన్ మాట్లాడుతూ, "అమెరికా-చైనా టారిఫ్ రేట్లు ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉండటం పెట్టుబడిదారుల ఆందోళనలను తగ్గించింది." ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వంటి రక్షణాత్మక రంగాల నుంచి అధిక రాబడినిచ్చే రిస్కీ ఆస్తుల వైపు మళ్లిస్తున్నారని ఆయన తెలిపారు.


ఫెడ్ ఈ ఏడాది మళ్లీ రేట్లు తగ్గిస్తుందా?


తాజా ద్రవ్యోల్బణ డేటా ఈ ఏడాది చివరి నాటికి ఫెడరల్ రిజర్వ్ రేట్లు తగ్గించే అవకాశాలను పెంచొచ్చు. వృద్ధి ఆందోళనలు కొనసాగుతూ, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటంతో, ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతు ఇవ్వాలని ఫెడ్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అయితే, ఫెడ్ మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. భవిష్యత్తులో వెలువడే ఆర్థిక సూచికలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.


2025లో బంగారం భవితవ్యం ఏమిటి?


స్వల్పకాలికంగా ధరలు తగ్గినప్పటికీ, 2025లో బంగారం ధర ఇప్పటివరకు దాదాపు 20 శాతం పెరిగింది. గత నెలలో ఔన్సుకు 3,500 డాలర్లపైన జీవనకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికా-చైనా ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధిని దెబ్బతీస్తుందనే లేదా ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందన్న ముందస్తు భయాలే ఈ ర్యాలీకి కారణం అని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ఆ భయాలు తగ్గడంతో, ద్రవ్యోల్బణం తగ్గడంతో.. బంగారం దూకుడు తగ్గొచ్చు. కానీ పూర్తిగా కాకపోవచ్చు. ఒకవేళ ఫెడ్ రేట్లు తగ్గిస్తే లేదా కొత్త ఉద్రిక్తతలు తలెత్తితే, బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని సూచనలు ఇస్తున్నారు. అయితే ఇదంతా ట్రంప్ చేతుల్లోనే ఉంది. సుంకాలు భారీగా పెంచడం.. పలు దేశాలతో వైరం పెంచుకోవడం.. ఇతర కఠిన నిర్ణయాలతో అమెరికా ఆర్థిక మాంద్యం బారిన పడే అవకాశం ఉంటుంది. అప్పుడు సురక్షిత పెట్టుబడిగా బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగి రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa