పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ కు బాహాటంగా టర్కీ మద్దతిస్తుండడం తెలిసిందే. దాంతో, భారత్ లో వాణిజ్యపరంగా టర్కీకి ఎదురుగాలి వీస్తోంది. టర్కీ సంస్థలతో భారత్ సంస్థలు, వర్సిటీలు సంబంధాలు తెంచుకుంటున్నాయి. ఈ విధంగా భారత్ ఎఫెక్ట్ కు గురైన వాటిలో సెలెబీ సంస్థ కూడా ఒకటి. ఇది భారత్ విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందిస్తుంది.భారత ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం టర్కీకి చెందిన సెలెబీ ఏవియేషన్ హోల్డింగ్ సంస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ దెబ్బకు ఇస్తాంబుల్ స్టాక్ మార్కెట్లో మే 16న కంపెనీ షేరు ఏకంగా 10 శాతం కుప్పకూలింది. గత నాలుగు వాణిజ్య దినాల్లోనే ఈ సంస్థ షేరు విలువ దాదాపు 30 శాతం ఆవిరైందని సమాచారం. భారత్లోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సేవలను సెలెబీ అనుబంధ సంస్థ అందిస్తూ వచ్చింది.'ఆపరేషన్ సిందూర్' సమయంలో తుర్కియే ప్రభుత్వం పాకిస్థాన్కు బాహాటంగా మద్దతు పలకడమే కాకుండా, తమ సైనికులను కూడా పంపించిందని వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సెలెబీ సంస్థకు జారీ చేసిన సెక్యూరిటీ క్లియరెన్స్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో భారత్లో కంపెనీ కార్యకలాపాలు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారాయి.కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే, అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ లిమిటెడ్ కూడా సెలెబీతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకుంది. దీంతో ముంబయి, అహ్మదాబాద్ విమానాశ్రయాల నుంచి సెలెబీ వైదొలగాల్సి వచ్చింది. ఈ విషయాన్ని రెండు విమానాశ్రయాల ప్రతినిధి ఒక ప్రకటనలో ధృవీకరించారు. అదానీ ఎయిర్పోర్ట్స్ ప్రస్తుతం ముంబయి, అహ్మదాబాద్తో పాటు మంగళూరు, గువహాటి, జైపుర్, లఖ్నవూ, తిరువనంతపురం విమానాశ్రయాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అదానీ బాటలోనే, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కూడా సెలెబీతో తమ ఒప్పందాన్ని ముగించుకుంది. సెలెబీ స్థానంలో ఇకపై ఏఐఎస్ఏటీఎస్ , బర్డ్గ్రూప్లతో కలిసి పనిచేయనున్నట్లు DIAL ప్రకటించింది.ఈ పరిణామాలపై సెలెబీ సంస్థ తాజాగా ఒక వివరణ విడుదల చేసింది. తమ సంస్థ పూర్తిగా టర్కీకి చెందిన కంపెనీ కాదని, అలాగే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. "టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కుమార్తె సుమెయ్యి మా కంపెనీని నియంత్రిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. మా మాతృసంస్థలో ఆ పేరుతో ఎవరికీ ఎలాంటి హక్కులు గానీ, వాటాలు గానీ లేవు. మా కంపెనీ యాజమాన్య హక్కులన్నీ పూర్తిగా సెలెబీయోగ్లు కుటుంబానికే పరిమితం. వారికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు," అని కంపెనీ తమ ప్రకటనలో పేర్కొంది. అయినప్పటికీ, భారత ప్రభుత్వ చర్యలతో కంపెనీ తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa