ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదవాడి సొంతింటి కలను నిజం చేసే పనిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదవారికి ఇంటి పట్టాతో పాటుగా నిర్మాణానికి ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పట్టాలను ఇస్తోంది. అయితే పేదవారి కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఇంటిని నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.. ఇంటి ప్లాన్ మంజూరును సులభతరం చేస్తూ నోటిఫికే షన్ జారీ చేసింది. ఈ మేరకు 60 చదదరపు గజాలు (50 చదరపు మీటర్లు) స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి ఇక నుంచి మున్సిపాలిటీ అనుమతి అవసరం లేదని తెలిపింది.
ఏపీ ప్రభుత్వం గ్రౌండ్ ప్లోర్, ఫస్ట్ ప్లోర్ నిర్మాణాలకు అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి ఎంఏయూడీ (మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఇంటికి సంబంధించి దరఖాస్తుదారుడు ఆన్లైన్లో కేవలం రూపాయి టోకెన్ ఫీజు చెల్లించి.. రిజిస్టర్ చేసుకుని స్వీయ ధ్రువీకరణ ద్వారా ఇంటి నిర్మాణం కోసం అనుమతి పొందే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. అయితే ఈ నిబంధన ప్రభుత్వ భూములు, నిషేధిత, వివాదాస్పద భూములలో చెల్లదని ఉత్తర్వులలో ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయంతో పేదలకు ఎంతో మేలు కలుగుతుంది అంటున్నారు.
పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందరికి ఇళ్లు పేరుతో కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామంలో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్ల స్థలాన్ని పేదలకు కేటాయిస్తారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని, సిబ్బంది వాటిని పరిశీలిస్తారు. అర్హులైన వారిని గుర్తించి, ఇంటి నిర్మాణం కోసం గృహ నిర్మాణ సంస్థ ద్వారా సహాయం అందిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకోవడం మొదలైంది. మీరు అక్కడకు వెళ్లి వివరాలు ఇస్తే, అవి వీఆర్వో లాగిన్కు చేరుతాయి. రెవెన్యూ అధికారులు మీ పత్రాలను చూసి, స్థలం మంజూరు చేయడానికి సిఫారసు చేస్తారు. దీంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద ఆర్థిక సహాయం పొందే అవకాశం కూడా ఉంటుంది.
ఇంటి స్థలం పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. దారిద్య్రరేఖకు దిగువన ఉండి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇల్లు లేదా స్థలం ఉండకూడదు. గతంలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇల్లు పొంది ఉండకూడదు. మీకు 5 ఎకరాల మెట్ట భూమి లేదా 2.5 ఎకరాల మాగాణి భూమికి మించి ఉండకూడదు. స్థలం మంజూరైన రెండేళ్లలో ఇల్లు కట్టుకోవాలి. ఈ అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
![]() |
![]() |