ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ (శనివారం) కర్నూలులో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ ఉదయం 11:55లకు సీక్యాంపు రైతుబజార్కు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీ క్యాంపు రైతు బజార్ను పరిశీలించి, రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతారు. రైతులతో మాట్లాడి ఆయా సమస్యల గురించి తెలుసుకుంటారు. అన్నదాతల సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించనున్నారు.ఈరోజు మధ్యాహ్నం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పార్క్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ధనలక్ష్మి నగర్ పార్కులో రూ.50 లక్షలతో అభివృద్ధి పనులకు గుర్తుగా పైలాన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్రీయ విద్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. అలాగే పాణ్యం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు మాట్లాడతారు. ఈ సమావేశంలో నేతలకు ఆయా కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కర్నూలులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు పలు ఆంక్షలు విధించారు. సీఎం చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను మళ్లించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు కర్నూలు పర్యటనకు 1700 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కర్నూల్ పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం 5:25 గంటలకు ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు తిరుగుపయనం కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa