ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరువూరులో వేడెక్కిన రాజకీయం, టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 12:42 PM

కృష్ణా జిల్లా, తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు (సోమవారం) ఉదయం నుంచి కూడా టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో.. వారినిని పోలీసులు చెదరగొడుతున్నారు. ఛైర్మన్ ఎన్నిక సందర్బంగా ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను కల్పించారు. ఈ క్రమంలో కౌన్సిల్ హాల్‌లోకి వెళ్లేందుకు వైసీపీ సభ్యులు బారికేడ్లు నెట్టుకుని లోపలికి వచ్చే ప్రయత్నం చేయగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ, వైసీపీ సభ్యులను ఇద్దరినీ కూడా చెదరగొట్టి శాంతియుత వాతావరణంలో ఎన్నిక జరగాలని పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. అలాగే మరో ఐదుగురు సభ్యులు టీడీపీ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంటుందన్న ఉద్దేశంతో వైసీపీ సభ్యులు హైడ్రామాకు తెరలేపారు. ఎట్టిపరిస్థితుల్లో అయినా ఛైర్మన్ పదవిని దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి జోగి రమేష్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa