ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర లేదు

national |  Suryaa Desk  | Published : Thu, May 22, 2025, 07:57 PM

ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగుతుందని, ఉగ్రవాదులు పాకిస్థాన్ లో దాక్కున్నా వదిలిపెట్టబోమని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ పూర్తి కాలేదని, ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉందని వివరించారు. ప్రస్తుతం నెదర్లాండ్ లో పర్యటిస్తున్న జైశంకర్ అక్కడి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. సైనిక ఘర్షణ తర్వాత పాక్ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రతిపాదించిందని చెప్పారు. దీనిపై ద్వైపాక్షిక చర్చల తర్వాత కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందని వివరించారు.ఈ విషయంలో అమెరికా సహా ఎవరి మధ్యవర్తిత్వం లేదని స్పష్టం చేశారు. భారత్, పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపైనా మంత్రి జైశంకర్ స్పష్టత ఇచ్చారు. కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఒక విధానంగా ప్రోత్సహించడంపై భారత్ ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తోందని, అలాంటి చర్యలకు తగిన రీతిలో బదులిచ్చే హక్కు భారత్‌కు ఉందని జైశంకర్ నొక్కి చెప్పారు."ఆపరేషన్ సిందూర్ ను వ్యూహాత్మకంగానే కొనసాగిస్తున్నాం. ఏప్రిల్ 22 నాటి ఘటనలు పునరావృతమైతే, కచ్చితంగా ప్రతిస్పందన ఉంటుందని చెప్పడానికే ఈ ఆపరేషన్. ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో ఉన్నా సరే, వారిని అక్కడే మట్టుబెడతాం" అని జైశంకర్ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa