మహారాష్ట్రలోని సాంగ్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్య అభ్యసిస్తున్న 22 ఏళ్ల యువతిపై ఆమె ఇద్దరు క్లాస్మేట్స్, వారి మరో స్నేహితుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి విశ్వామ్బాగ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.కర్ణాటకలోని బెళగావికి చెందిన 22 ఏళ్ల యువతి, సాంగ్లీలోని ఓ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. మే 18వ తేదీ, ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుల్లో ఇద్దరు ఆమె క్లాస్మేట్స్ కాగా ఒకరు పుణె, మరొకరు సోలాపూర్కు చెందినవారు మూడో వ్యక్తి వారి స్నేహితుడు సాంగ్లీకి చెందినవాడు. నిందితుల వయసు 20 నుంచి 22 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో, సినిమాకు వెళ్లే ముందు కాసేపు తమ అపార్ట్మెంట్లో ఉందామని చెప్పి నిందితుల్లో ఒకరు బాధితురాలిని వాన్లెస్వాడిలోని తమ అద్దె ఫ్లాట్కు తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ నిందితులు ముగ్గురూ మద్యం సేవించి, బాధితురాలికి మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చారని ఆమె ఆరోపించారు. అది తాగిన కొద్దిసేపటికే తనకు కళ్లు తిరుగుతున్నట్లు అనిపించిందని, ఆ తర్వాత ముగ్గురూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు వివరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని నిందితులు తనను బెదిరించినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.భయంతో రెండు రోజులు మౌనంగా ఉన్న బాధితురాలు, చివరకు ధైర్యం కూడగట్టుకుని మంగళవారం రాత్రి తన తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని వివరించింది. అనంతరం, తల్లిదండ్రుల సహాయంతో విశ్వామ్బాగ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వారిని సాంగ్లీ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం నిందితులకు మే 27 వరకు పోలీసు కస్టడీ విధించింది.విశ్వామ్బాగ్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుధీర్ భలేరావ్ మాట్లాడుతూ, "బాధితురాలి వాంగ్మూలాన్ని ధృవీకరించుకుంటున్నాం. కేసు నమోదు చేసిన వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి పంపాం. వైద్య నివేదిక ఇంకా రావాల్సి ఉంది" అని తెలిపారు. నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 70(1) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేరం రుజువైతే నిందితులకు కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పోలీసులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa