ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూన్ నుంచేఎన్టీఆర్ బేబీ కిట్ పథకం పునఃప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 08:02 PM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిడ్డలను ప్రసవించే మహిళలు, శిశువుల రక్షణ కోసం గతంలో అమలు చేసిన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పునఃప్రారంభిస్తోంది. బాలింతలకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లను అందజేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దీంతో వచ్చే నెల నుంచి ఈ పథకం మొదలవుతుందని అధికారులు తాజాగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రుల్లో ఏటా వేలాది కాన్పులు జరుగుతాయి. ఎన్టీఆర్ బేబీ కిట్లు మళ్లీ ఇవ్వడం వల్ల పుట్టిన పిల్లలకు మంచి జరుగుతుంది.


టీడీపీ ప్రభుత్వం 2016 జులైలో ఎన్టీఆర్ బేబీ కిట్ల పేరుతో ఈ పథకాన్ని మొదలుపెట్టింది. 2019లో వైఎస్ఆర్సీపీ సర్కారులు ఈ పథకం పేరును డాక్టర్ వైఎస్సార్ బేబీ కిట్లుగా మార్చింది. ఏడాది పాటు ఇచ్చి ఆ తర్వాత ఆపేసింది. దాదాపు నాలుగేళ్లుగా ఈ పథకం నిలిచిపోవడంతో లక్షల మంది మహిళలు లబ్ది పొందలేకపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మళ్లీ మొదలుపెడుతున్నారు. దీనివల్ల నవజాత శిశు మరణాల రేటు తగ్గుతుంది. అంతేకాకుండా తల్లులు, వారి కుటుంబాలకు ఆర్ధికంగా కలిసొస్తుంది.


ఇక, రూ.1410 విలువ చేసే ఎన్టీఆర్ బేబీ కిట్‌లో 11 రకాల వస్తువులు ఉంటాయని అధికారులు తెలిపారు. చిన్నారికి దోమతెరతో కూడిన బెడ్, వాటర్‌ ప్రూఫ్‌ కాట్‌ షీట్, బేబీ డ్రస్, బేబీ సబ్బు, పౌడర్, న్యాప్‌కిన్, టవల్స్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బొమ్మ, తల్లి చేతులు శుభ్రం చేసుకోవడానికి లిక్విడ్."వీటి విలువ రూ.1410గా ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు చెప్పారు. ఈ పథకం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరుగుతాయని అధికారులు అన్నారు.


ఇక, ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం కోసం రూ.51.14 కోట్లు మంజూరు చేసినట్లు ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఎన్టీఆర్ బేబీ కిట్ ఒక్కోటి రూ.1,410 వరకు ఖర్చు అవుతుందని అందులో పేర్కొన్నారు. ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం పునరుద్ధరణ ద్వారా దాదాపు 4 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన తల్లులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో ఈ కిట్‌లను అందజేస్తారు. ఈ పథకం ముఖ్యోద్దేశం. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడటం, శిశు మరణాల రేటును తగ్గించడం. అంతేకాదు, ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాలకు శిశు సంరక్షణ సామాగ్రిని ఉచితంగా అందించడం దీని ఉద్దేశం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa