ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో ఆదివారం ఉదయం భారీ వర్షం, ఎయిర్‌పోర్ట్‌పై ప్రభావం

national |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 08:14 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)పై ఈ వర్షం తీవ్ర ప్రభావం చూపింది. టెర్మినల్ 1 అరైవల్ ఫోర్‌కోర్టు వద్ద బయట ఏర్పాటు చేసిన టెన్సైల్ ఫ్యాబ్రిక్‌లో కొంత భాగం దెబ్బతింది. ఫ్యాబ్రిక్ చిరిగిపోయి, నీరు ధారగా కిందికి పడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఈ ఘటనతో పాటు పలు విమానాలను దారి మళ్లించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.విమానాశ్రయంలో టెన్సైల్ ఫ్యాబ్రిక్ దెబ్బతినడంపై ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్  ప్రతినిధి స్పందించారు. "విపరీతమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించిన డిజైన్‌లో భాగంగానే ఇది జరిగింది. ఎక్కువ నీరు నిలిచిపోకుండా, ఒత్తిడికి ఫ్యాబ్రిక్‌లోని ఒక భాగం సర్దుబాటు చేసుకుని నీటిని బయటకు పంపేందుకు వీలు కల్పించింది" అని ఆయన వివరించారు. టెర్మినల్ నిర్మాణానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, ఇతరభాగాలపై కూడా ఎటువంటి ప్రభావం పడలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, గతేడాది కూడా ఇదే టెర్మినల్ 1 వద్ద భారీ వర్షానికి పైకప్పు కూలి ఒకరు మరణించగా, ఆరుగురు గాయపడిన ఘటన తెలిసిందే. తాజా ఘటనతో ప్రయాణికుల్లో కొంత ఆందోళన వ్యక్తమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa