ఉత్తర ప్రదేశ్ కాన్పూర్లోని నరమౌలాలో రతన్ ప్లానెట్ అపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ అనేక మంది నివాసం ఉంటున్నారు. అయితే ఈ అపార్ట్మెంట్కు సొసైటీ కార్యదర్శిగా.. అక్కడే నివాసం ఉంటున్న రిటైర్డ్ ఇంజినీర్ రూపేంద్ర సింగ్ యాదవ్ పని చేస్తున్నాడు. అయితే ఆదివారం రోజు సాయంత్రం తన తోటి నివాసి అయిన క్షితిజ్ మిశ్రాకు కేటాయించిన స్థలంలో అదే అపార్ట్మెంట్కు చెందిన మరో వ్యక్తి కారు పార్క్ చేశాడు. దీంతో క్షితిజ్ మిశ్రా.. సొసైటీ కార్యదర్శి రూపేంద్ర సింగ్ ఫోన్ చేశాడు. వెంటనే కిందకు రమ్మని కోరాడు. కానీ అతడు మాత్రం గార్డును పంపించి సమస్య పరిష్కరిస్తానని చెప్పాడు. అయినప్పటికీ క్షితిజ్ మిశ్రా వినకపోవడంతో.. నేరుగా అతడే కిందకు చేరుకున్నాడు.
మైదానంలో ఉన్న క్షితిజ్ మిశ్రా వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించడం కోసం మాట్లాడుతుండగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ముఖ్యంగా తనకు కేటాయించిన స్థలంలో మరో వ్యక్తి కారు పెట్టడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన క్షితిజ్ మిశ్రా.. రూపేంద్ర సింగ్పై దాడి చేయడం ప్రారంభించాడు. ముందుగా చేతులతో కొట్టాడు. అయినా కోపం తీరలేదు. మరింత ఎక్కువైంది. దీంతో రూపేంద్ర సింగ్ ముక్కును కొరికేశాడు. తీవ్ర రక్తస్రావం కాగా.. సొసైటీ కార్యదర్శి నొప్పితో విలవిల్లాడిపోయాడు. కేకలు వేస్తూ పరుగులు పెట్టాడు. దీంతో విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆపై ఆయన కుమార్తె ప్రియాంక.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారు పార్కింగ్ విషయంలో క్షితిజ్ మిశ్రా తన తండ్రితో గొడవ పడి ముక్కు కొరికేసినట్లు వివరించింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షితిజ్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. ఆపై అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశిలీంచగా.. అందులో క్షితిజ్ మిశ్రా, రూపేంద్ర సింగ్పై దాడి చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరోవైపు రూపేంద్ర సింగ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa