ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరి, పత్తి సహా 14 రకాల పంటల మద్దతు ధర పెంపు

national |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 07:29 PM

రోజురోజుకూ పెట్టుబడి వ్యయం పెరిగి వ్యవసాయం మరింత కష్టంగా మారుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలను పెంచుతూ తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కల్పించింది. ఈ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను.. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా మీడియాకు వివరించారు. 14 ఖరీఫ్ పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెంచినట్లు వెల్లడించారు. ఇందులో ఆహార, వాణిజ్య, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా ఇతర పంటలు ఉన్నాయి.


ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిన ఈ పంటల మద్దతు ధర పెంపు 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు వర్తిస్తుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. రైతుల పంట ఉత్పత్తికి అయ్యే వ్యయంపై కనీసం 1.5 రెట్లు కనీస మద్దతు ధర ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నైజర్‌సీడ్‌కు క్వింటాలుకు రూ.820 తో అత్యధిక పెంపు లభించిందని పేర్కొన్నారు. రాగి, పత్తి, నువ్వులకు కూడా గణనీయమైన పెంపు దక్కినట్లు వివరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు అధిక లాభాలు అందించడమే కాకుండా.. పప్పుధాన్యాలు, నూనె గింజలు వంటి ఇతర పంటల సాగును ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. 2014 తర్వాత దేశంలో వరి, ఇతర ఖరీఫ్ పంటల సేకరణ.. ఎంఎస్పీ చెల్లింపులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు.


2018-19 కేంద్ర బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా ఈ కనీస మద్దతు ధర పెంపు జరిగిందని వివరించారు. నైజర్‌సీడ్‌కు క్వింటాలుకు రూ.820తో అత్యధిక ఎంఎంస్పీ లభించింది. రాగులకు రూ.596, పత్తికి రూ.589, నువ్వులకు రూ.579 చొప్పున మద్దతు ధరను పెంచారు. క్వింటాల్‌ వరిపై రూ.69 పెంచడంతో కనీస మద్దతు ధర రూ.2369కి చేరింది. పప్పు ధాన్యాల విషయానికి వస్తే కందులు రూ.450, పెసర్లు రూ.86, మినుములు రూ.400 పెంచారు. నూనె గింజల విషయానికి వస్తే. వేరుశనగ రూ.480, పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్‌కు రూ.436 చొప్పున పెంచారు.


ఈ క్రమంలోనే ఈ 14 పంటలకు ఎంఎస్‌పీ కోసం రూ.2.07 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లు కేటాయించగా.. రైతులకు పెట్టుబడిపై 50 శాతం మార్జిన్‌ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అదే సమయంలో రైతు సంక్షేమం కోసం ఇంట్రెస్ట్ సబ్వేషన్స్ స్కీమ్ కూడా కేంద్రం ప్రకటించింది.


అదే సమయంలో దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారుల నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు- నెల్లూరు హైవే 4 లైన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అలాగే వార్దా-బల్లార్ష హైవే 4 లైన్ల నిర్మాణం.. రత్లాం నాగాడా హైవే నాలుగు లైన్ల నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa