పహల్గామ్ ఉగ్రదాడి.. దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే భారత త్రివిధ దళాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. మరీ ముఖ్యంగా భారత్-పాక్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో నిఘాను మరింత పటిష్ఠం చేశారు. దేశంలో కూడా ఉగ్రవాద కార్యకలాపాలు, పాక్ గూఢచారులకు సమాచారం అందించే వారిని గుర్తించే పనిలో నిఘా వర్గాలు పడ్డాయి. మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రత పరంగా అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశవ్యాప్తంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్స్ నిర్వహించారు.
తాజాగా మరోసారి మాక్ డ్రిల్ చేపట్టేందుకు కేంద్ర హోంశాఖ సిద్ధమైంది. గురువారం సాయంత్రం.. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల 4 రోజుల పాటు భారత్ పాక్ మధ్య జరిగిన వైమానిక దాడుల్లో.. ఈ రాష్ట్రాలు పాక్ వైపు నుంచి భారీ దాడులు చూశాయి. ఈ మాక్ డ్రిల్ సమయంలో ఆ 4 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు సూచించాయి.
అయితే ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లలోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేయడానికి కొన్ని గంటల ముందు.. మే 7వ తేదీన కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో నిర్వహించిన మాక్ డ్రిల్తో ప్రజలను అలర్ట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మాక్ డ్రిల్ చేపట్టాలని నిర్ణయించింది.
గతంలో మాక్ డ్రిల్ నిర్వహించిన సమయంలో ఎయిర్ స్ట్రైక్స్ హెచ్చరికలు చేసే సైరన్లు మోగించారు. ఆ సమయంలో ఏదైనా దాడి జరిగినప్పుడు తమను, తమ చుట్టూ ఉన్న వారిని ఎలా రక్షించుకోవాలో సివిల్ డిఫెన్స్ ప్రోటోకాల్లపై పౌరులు, విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం అదే మొదటి కావడం విశేషం. దేశంలోని మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 250 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో.. పాకిస్తాన్తో 532 కిలోమీటర్ల సరిహద్దును పంచుకునే పంజాబ్, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, అమృత్సర్, గురుదాస్పూర్, తర్న్ తరణ్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. దీంతో పాటు అన్ని సరిహద్దు జిల్లాలను హై అలర్ట్లో ఉంచారు. బహిరంగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా అన్నింటినీ రద్దు చేశారు. అదే సమయంలో పాకిస్తాన్తో 1037 కిలోమీటర్ల సరిహద్దును పంచుకునే రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసివేయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa