ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టిక్ ట్యాంక్‌లో బంగారం.. తీసేందుకు ప్రయత్నించి నలుగురి మృతి

Crime |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 07:37 PM

జ్యువెల్లరీ ఫ్యాక్టరీలోని ఓ సెప్టిక్ ట్యాంకులో బంగారం మడ్డి పేరుకు పోయింది. అయితే ఈ విషయం గుర్తించిన యజమాని అందులోంచి బంగారాన్ని తీయించాలనుకున్నాడు. అందుకోసం అక్కడే పని చేసే ఎనిమిది మంది కార్మికులను అడగ్గా.. వారు అందులోకి దిగేందుకు నిరాకరించారు. కానీ ఎక్కువ డబ్బులు ఇస్తానని ఆశ చూపగా.. వెంటనే దిగేశారు. బంగారం వెతికే క్రమంలో సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడలేదు. క్షణాల్లోనే అంతా స్పృహ తప్పి పడిపోయారు. లోపలికి దిగిన వాళ్లు ఎంతకూ బయటకు రాకపోవడంతో.. యజమాని వారికేమైనా అయిందేమోననుకుని పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిబ్బంది సెప్టింక్ ట్యాంకులోకి దిగగా.. నలుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. అలాగే మరో నలుగురు ప్రాణాలతో ఉండగా.. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.


రాజస్థాన్ జైపూర్‌లోని ఓ జ్యువెల్లరీ షాపు యజమాని వికాస్ మెహతా బంగారం, వెండి ప్రాసెసింగ్ చేయిస్తున్నారు. తన ఫ్యాక్టరీలోని కార్మికులతో ఈ పనులు చేయిస్తుండగా.. వీటిలోని కొంత మొత్తం సెప్టిక్ ట్యాంకులో పేరుకుపోయింది. విషయం గుర్తించిన యజమాని సోమవారం రోజు పలువురు కార్మికులను లోపలికి దిగి బంగారం, వెండి తీయాలని కోరాడు. ఎనిమిది మంది కార్మికులను సంప్రదించగా.. వారంతా దిగేందుకు ఒప్పుకోలేదు. దీంతో యజమాని వికాస్ మెహతా.. బంగారం రజను తీసుకు వస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తానని ఆశ చూపించాడు. దీంతో వారంతా సెప్టిక్ ట్యాంకులోకి దిగేందుకు ఒప్పుకున్నారు. వెంటనే అందులోకి దిగి బంగారం కోసం గాలించారు.


కానీ సెప్టిక్ ట్యాంకులో పలు రసాయనాల వల్ల అందులోకి దిగిన కూలీలకు శ్వాస ఆడలేదు. దీంతో వారంతా అందులోనే స్పృహ తప్పి పడిపోయారు. అయితే ఎవర్ని పిలిచినా వారు చప్పుడు చేయకపోవడంతో వెంటనే వికాస్ మెహతా పోలీసులకు సమాచారం అందించారు. ఇలా రెస్క్యూ సిబ్బంది సహా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సెప్టిక్ ట్యాంకులోకి దిగారు. అప్పటికే వారంతా స్పృహ తప్పి పడిపోగా.. వెంటనే వారందరినీ బయటకు తీసుకు వచ్చారు. ఆపై ఆస్పత్రికి తరలించారు. అయితే ఇందులో నలుగురు కార్మికులు ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


అయితే చనిపోయిన వారిలో రోహిత్ పాల్, సంజీవ్ పాల్, హిమాంగ్షు సింగ్, అర్పిత్ యాదవ్‌లుగా గుర్తించారు. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే సెప్టిక్ ట్యాంకులోకి కార్మికులను పంపడంతోనే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. అందులో నిజంగానే బంగారు మడ్డి ఉందా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా యజమాని వికాస్ మెహతా సహా కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లత్ స్పందించారు. సెప్టిక్ ట్యాంకుల్లోకి దిగి పారిశుద్ధ్య కార్మికులు చనిపోతున్న ఘటనలు రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు.


సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచేందుకు యంత్రాలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని.. కానీఇంకా చర్యలు తీసుకోవడం లేదని మాజీ సీఎం అశోక్ గహ్లాత్ వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa