ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరెంటు కట్‌తో లిఫ్టులో ఇరుక్కున్న బాలుడు, గుండెపోటుతో తండ్రి మృతి

national |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 08:05 PM

ప్రతీ ఒక్కరికి తమ పిల్లలపై ప్రేమ ఉంటుంది. కానీ కొందరికి మాత్రం విపరీతమైన ప్రేమ ఉంటుంది. అందుకు కారణం ఏమైనప్పటికీ.. బిడ్డలను అతి జాగ్రత్తగా చూసుకుంటారు. అనుక్షణం వారిని ఓ కంట కనిపెట్టుకుంటూ ఉంటారు. వారికి చిన్న దెబ్బ తగిలినా తమకే తగిలినట్లు విలవిల్లాడిపోతారు. ఇక ఏదైనా పెద్ద గాయం అయి రక్తం వంటివి వస్తే.. ఇక ఆ తల్లిదండ్రులు విపరీతంగా ఏడ్చేస్తూ తమ ప్రాణాలే పోయినట్లుగా భావిస్తుంటారు. ఇలాంటి వాళ్లను మనం ఎక్కడో ఓ చోట చూసే ఉంటాం. అచ్చంగా ఇలాగే ప్రేమ చూపించే ఓ తండ్రి.. కుమారుడికి ఎదురైన ఓ సమస్యకు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.


ముఖ్యంగా తన ఎనిమిదేళ్ల బాలుడు లిఫ్టు ఎక్కగా.. కరెంట్ పోయింది. దీంతో అతడు అందులోనే ఇరుక్కుపోయాడు. అయితే కుమారుడిపై విపరీతమైన ప్రేమ కల్గిన అతడి తండ్రి విషయం గుర్తించి అల్లాడిపోయాడు. తన కుమారుడు లోపల భయపడిపోతున్నాడేమోననుకుని ఏం కాదు, ఏం కాదని చెబుతూనే తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈక్రమంలోనే అతడికి గుండెపోటు వచ్చింది. గుండె మీద చేయి వేసుకుని కూడా కుమారుడి గురించే కలవరించాడు. ఒక్కసారిగా కుప్పకూలి కాసేపట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆపై కొద్ది నిమిషాల్లోనే కరెంటు రాగా.. బాలుడు క్షేమంగా బయటకు వచ్చాడు. కానీ అప్పటికే వారికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జత్కేడీ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రిషిరాజ్ భట్నాగర్ తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. సోమవారం రాత్రి తన కుమారుడితో కలిసి తన ప్లాట్ నుంచి కిందకు వచ్చారు. తన కుమారుడిని ఇంటికి వెళ్లమని చెప్పగా అతడు ఎలివేటర్ ఎక్కి పై అంతస్తుకు వెళ్లేందుకు బటన్ నొక్కాడు. అప్పుడే కరెంటు పోవడంతో లిఫ్ట్ ఆగిపోయింది.


లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన తన కుమారుడికి ఏమవుతుందోనని రిషిరాజ్ భయపడిపోయాడు. జనరేటర్ రూము వద్దకు, లిఫ్ట్ వద్దకు మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఆయాసపడుతూ, తీవ్ర ఆందోళనకు గురి కావడంతో అతడికి గుండెపోటు వచ్చింది. కొన్ని నిమిషాల్లోనే జనరేటర్ పని చేయడంతో కరెంటు తిరిగి వచ్చి ఆ ఎనిమిదేళ్ల పిల్లాడు క్షేమంగా బయటకు వచ్చాడు. కానీ ఆలోపే ఆ కుటుంబానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


గుండెపోటుతో పడిపోయిన రిషిరాజ్‌కు అపార్ట్‌మెంట్‌వాసులు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అతడు గుండెపోటు వచ్చిన చనిపోయినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి విషయాలు పోస్టుమార్టం తర్వాత వెల్లడి అవుతాయని పోలీసు అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


రిషిరాజ్ ఆ కాలనీలో అందరిలో నోట్లో నాలుకలా ఉండేవాడని, ఎవరికి ఏ సాయం కావాలన్నా ముందుకు వచ్చేవాడని స్థానికులు తెలిపారు. అందర్నీ ప్రేమతో ఆప్యాయంగా పలకరించే రిషిరాజ్ లేరంటే నమ్మలేకపోతున్నామని కాలనీవాసులు గద్గద స్వరంతో వెల్లడించారు. తీవ్ర ఆందోళన, కుమారుడికి ఏమవుతుందోనన్న భయమే రిషిరాజ్‌ను చంపేసిందని అభిప్రాయపడుతున్నారు. మూడు నెలల వ్యవధిలో రిషిరాజ్‌కు గుండెపోటు రావడం ఇది రెండోసారి అని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. రిషిరాజ్ తండ్రి కూడా గుండెపోటుతోనే మరణించినట్లు వెల్లడించారు. సాయంత్రం వేళ ఇంట్లో టీ తాగుతున్న సమయంలో రిషిరాజ్ తండ్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని గుర్తు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa