ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షం మిగిల్చిన విషాదం.. వరద నీటిలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి

Crime |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 08:05 PM

మే నెలలోనే వరుణుడు రాష్ట్రంలోకి ప్రవేశించాడు. గత రెండు రోజులుగా కుండపోత వానలు కురిపిస్తున్నాడు. జోరు వానకు భాగ్యనగరం తడిసి ముద్దయ్యింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, లింగంపల్లి, సికింద్రాబాద్‌, అల్వాల్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, బోరబండ, సూరారం, ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. జోరువాన వల్ల భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. గంటల తరబడి వాహనదారులు రోడ్ల మీదనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక హైదరాబాద్‌లో కురిసిన కుండపోత వాన ఓ ఇంట్లో తీవ్ర విషాదం మిగిల్చింది. వరద నీటిలో కొట్టుకుపోయి ఓ వ్యక్తి చనిపోయాడు. ఆ వివరరాలు..


మంగళవారం హైదరాబాద్‌లో కురిసిన కుండపోత వాన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం సాయంత్రం నగరంలో కురిసి భారీ వర్షానికి.. ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఈ సంఘటన సూరారం కాలనీలో చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉండే పద్మారావు(40) అనే వ్యక్తి వరద నీటిలో పడి కొట్టుకుపోయి.. పక్కనే ఉన్న నాలాలో పడి చనిపోయినట్లు తెలుస్తోంది.


దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని వెలికి తీశారు. ఆ తర్వాత దాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పద్మారావు ఒళ్లు తెలియని మత్తులో ఉన్నాడని.. అందుకే నీటిలో మునిగిపోతున్నా కూడా అతడికి తెలియలేదని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


మంగళవారం హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ సూచించారు.


అలానే హైదరాబాద్‌ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని.. పోలీసులు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ఎలక్ట్రిసిటీ విభాగాల అధికారులు కలిసి పని చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అలానే అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10,000 పరిహారం అందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని.. రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాంతో జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa