ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్లో దిగ్వేష్ రాథీ ‘మన్కడింగ్’ చర్చనీయాంశంగా మారింది. ఈ మన్కడింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అంపైర్లు బ్యాటర్ను నాటౌట్గా ప్రకటించారు. కానీ అంతకంటే ముందే లక్నో కెప్టెన్ పంత్ సైతం ఈ అప్పీల్ ఉపసంహరించుకున్నట్లు చెప్పాడు. అయితే దీనిపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. రిషభ్ పంత్ నిర్ణయాన్ని ఖండించాడు.
అసలేం జరిగిందంటే..
228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 17వ ఓవర్లో బ్యాటింగ్ చేస్తుండగా.. దిగ్వేశ్ రాథీ మన్కడింగ్ చేశాడు. స్ట్రైకింగ్ ఎండ్లో మయాంక్ అగర్వాల్ ఉండగా.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో జితేశ్ శర్మ ఉన్నాడు. అయితే జితేశ్ను దిగ్వేష్ మన్కడింగ్ చేయడానికి ప్రయత్నించాడు. బంతిని వేసే క్రమంలో ఆగిపోయి, బెయిల్స్ను లేపేశాడు. అప్పటికి జితేశ్ క్రీజుకు దూరంగా ఉన్నాడు. దిగ్వేష్ అప్పీల్ చేయగా.. దీంతో జితేశ్ ఔట్ అని అంతా భావించారు. కానీ రాథీ.. యాక్షన్ పూర్తి కావడంతో నిబంధనల ప్రకారం జితేశ్ను థర్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయం వెలువడకంటే ముందే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్.. అప్పీల్ను వెనక్కితీసుకున్నాడు. గొప్ప క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడని పంత్పై ప్రశంసల వర్షం కురిసింది.
అయితే పంత్త్పై ఐపీఎల్లో తొలిసారి మన్కడింగ్ను అమలు చేసిన రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. ఇది బౌలర్ పరువు తీయడమే అని వ్యాఖ్యానించాడు. పంత్ నిర్ణయాన్ని ఖండించాడు. “రిషభ్ పంత్ అద్భుతమైన క్రికెటర్. ఈ మ్యాచ్లో అతడు 118 రన్స్ చేశాడు. కానీ దిగ్వేష్ రాథీ గురించి మీరు ఒకసారి ఆలోచించండి. అతడు చేసిన పనిని కోట్లాది మంది ప్రజల ముందు కెప్టెన్ తప్పుబట్టాడు. ఇది కరెక్టు కాదు. ఎందుకంటే ఏ కెప్టెన్ అయినా ఆటగాడికి మద్దతు ఇవ్వాలి. ఇది బౌలర్కు ఘోరమైన అవమానం. మరోసారి అతడు మన్కడింగ్ చేయడు. దిగ్వేష్ నా చుట్టం కాదు.. నా ఫ్రెండ్ కూడా కాదు. కానీ నేను చెప్పేది ఒక్కటే. ఇలాంటి చర్యలతో బౌలర్ను హర్ట్ చేశారు” అని తన యూట్యూబ్ ఛానెల్లో అన్నాడు.
“క్రికెట్ రూల్స్లోనే దీని గురించి ఉంది. కానీ నిబంధనల మేరకు బ్యాటర్ ఔట్ కాదని థర్డ్ అంపైర్ తీర్పు ఇచ్చాడు. దాన్ని గౌరవించాలి. కానీ ఓసారి అప్పీల్ చేశాక.. మళ్లీ ఉపసంహరించుకోవడం ఎందుకు?” అని అశ్విన్ ప్రశ్నించాడు. కాగా 2019 ఐపీఎల్లో అశ్విన్.. జోస్ బట్లర్ను మన్కడింగ్ చేసి ఔట్ చేశాడు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రాగా.. రూల్స్ ప్రకారమే తాను నడుచుకున్నానని అశ్విన్ కౌంటర్ ఇచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa