ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపించేస్తున్న డొనాల్డ్ ట్రంప్

national |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 08:08 PM

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీలకు చెందిన పౌరులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇక ఈ అక్రమ వలసదారుల్లో భారతీయులు కూడా చాలా మందే ఉన్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఈ ఏడాది జనవరిలో డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అంటే జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు 1,100 మంది భారతీయులను అమెరికా బహిష్కరించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 62 శాతం మంది సాధారణ వాణిజ్య విమానాల్లోనే స్వదేశానికి తిరిగి వచ్చారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తాజాగా మీడియాకు తెలిపారు.


అక్రమ వలసలను అరికట్టే విషయంలో భారత్, అమెరికా మధ్య బలమైన సహకారం కొనసాగుతోందని రణధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. అక్రమ మార్గాల్లో అమెరికాలో ప్రవేశించిన వారిని.. లేదా అక్కడ నిబంధనలు ఉల్లంఘించిన వారిని కేంద్ర ప్రభుత్వం వెనక్కి రప్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు మొత్తం 1,080 మంది భారతీయులు అమెరికా నుంచి స్వదేశానికి చేరుకున్నారని వెల్లడించారు. బహిష్కరణకు గురైన భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే విషయంలో.. వారి గురించి పూర్తి వివరాలు అందిన తర్వాత, వారి జాతీయతను నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఈ డీపోర్టేషన్ ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య పరస్పర అవగాహన, సహకారం ఉందని రణధీర్ జైశ్వాల్ మరోసారి తేల్చి చెప్పారు.


విద్యార్థి (F), వృత్తి విద్యా , ఎక్స్ఛేంజ్ విజిటర్ (J) వీసాల దరఖాస్తుదారులపై కఠినమైన మార్గదర్శకాలు అమలు చేయాలని ఇటీవల అమెరికా ప్రభుత్వం చూస్తున్నట్లు వచ్చిన నివేదికలను కూడా ఈ సందర్భంగా రణధీర్ జైశ్వాల్ ప్రస్తావించారు. తాజా పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని.. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల సంక్షేమానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కొత్త నిబంధనలు భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలని పేర్కొన్నారు.


ఈ సమయంలోనే ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయుల కోసం భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని రణధీర్ జైశ్వాల్ తెలిపారు. ఆచూకీ కనిపించని ముగ్గురు పౌరుల కుటుంబ సభ్యులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని వెల్లడించారు. వారి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరించారు. త్వరలోనే ఆ ముగ్గురి జాడ దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు ఎప్పుడు, ఎక్కడ తప్పిపోయారు అనే వివరాలు మాత్రం విదేశాంగ శాఖ వెల్లడించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa