ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మరోసారి కవ్వింపులు.. సింధు జలాల ఒప్పందంపై సంచలన వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 08:10 PM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ నేరుగా దాడులు చేయకుండా.. పలు ఆంక్షలు, దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే రెండు దేశాల మధ్య కీలకంగా ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో భారత్ నుంచి పాకిస్తాన్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది. అంతేకాకుండా భారత్-పాకిస్తాన్ మధ్య చర్చలు అంటే.. అది కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద మాత్రమే ఉంటాయని భారత్ తేల్చి చెప్పేసింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత రెండు వైపుల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ప్రస్తుతం కాస్త ఉద్రిక్తతలు తగ్గాయి. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ మరోసారి భారత్ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు.


ఈ సందర్భంగా సింధు జలాల ఒప్పందం, కాశ్మీర్ అంశంపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల ఒప్పందం తమ దేశానికి రెడ్ లైన్ అని పేర్కొన్న ఆయన.. నీటి సమస్యపై పాకిస్తాన్ ఎప్పటికీ రాజీపడదని ప్రకటించారు. పాక్‌లోని యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లు, ప్రిన్సిపాల్స్, సీనియర్ ప్రొఫెసర్లు, విద్యావేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఆసిమ్ మునీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. సింధు నీరు పాకిస్తాన్‌కు రెడ్ లైన్ అని.. 24 కోట్ల పాకిస్తానీలకు ప్రాథమిక హక్కుగా ఉన్న దానిపై తాము ఎటువంటి రాజీకి అనుమతించమని తేల్చి చెప్పారు.


1960 సెప్టెంబర్‌లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై పాకిస్తాన్ నాయకులు గత కొన్ని రోజుల నుంచి పదేపదే భారత్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్తాన్ మంత్రులు కూడా సింధు నీటిని ఆపడం భారత్‌కు సరికాదని పేర్కొన్నారు. అంతేకాకుండా పాక్‌లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులు కూడా భారత్‌పై బెదిరింపులకు దిగుతున్నారు. పాకిస్తాన్‌కు సింధు జలాలను నిలిపివేస్తే.. ప్రధాని మోదీ శ్వాస ఆపేస్తాం అంటూ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ తీవ్ర హెచ్చరికలు చేశారు.


అయితే పహల్గామ్ ఉగ్రదాడి జరగడానికి కారణం కూడా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అని భారత వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి. ఈ ఉగ్రదాడి జరగడానికి కొన్ని రోజుల ముందే.. పాకిస్తాన్‌కు కశ్మీర్‌ జీవనాడి అంటూ ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి.


అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, పాకిస్తాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ సంతకాలతో ఈ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయకపోవడం గమనార్హం. ఈ ఒప్పందం ప్రకారం సింధు ఉపనదులైన తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్‌ నదులపై భారత్‌కు హక్కులు ఉంటాయి. ఈ ఉపనదుల సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్‌ ఎకరాల అడుగులు. సింధు నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కు కల్పించారు. ఈ నదుల సామర్థ్యం 135 మిలియన్ ఎకరాల అడుగులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa