ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రమంత్రి చిరాగ్ సంచలన నిర్ణయం,,,జాతీయ రాజకీయాల్లోంచి రాష్ట్ర రాజకీయాల్లోకి

national |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 08:52 PM

కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ జాతీయ రాజకీయాల్లోంచి రాష్ట్ర రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మరీ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే తన నిర్ణయాన్ని వెల్లడించారు. బిహార్ రాష్ట్ర రాజకీయాలకు తిరిగి రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అసలు రాజకీయాల్లోకి రావడానికి తన అసలు ప్రేరణ బీహార్ అభివృద్ధికి తోడ్పడటమేనని వివరించారు.


"నేను ఇంతకుముందు చెప్పాను. చాలా కాలంగా నన్ను నేను జాతీయ రాజకీయాల్లో చూసుకోలేకపోతున్నాను. నేను రాజకీయాల్లోకి రావడానికి ఏకైక కారణం బీహార్, బీహారీలు మాత్రమే. నా దార్శనికత ఎప్పుడూ బీహార్ ఫస్ట్. అలాగే బీహార్ ఎప్పుడూ అభివృద్ధి చెందాలని, ఇతర అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా ఉండాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను." అని కేంద్రమంత్రి చిరాగా పాశ్వాన్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.


ఇటీవలే హాజీపూర్ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా చిరాగ్ పాశ్వాన్ మూడోసారి ఎన్నికయ్యారు. తన రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మార్పు అవసరమని ఆయన సంకేతాలు ఇచ్చారు. "మూడోసారి ఎంపీ అయిన తర్వాత దిల్లీలో ఇది సాధ్యం కాదని నేను గ్రహించాను. నేను త్వరలో బీహార్‌కు తిరిగి రావాలని కోరుకుంటున్నానని పార్టీ ముందు నా కోరిక వ్యక్తం చేశాను" అని చిరాగ్ పాశ్వాన్ చెప్పుకొచ్చారు. అయితే నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందా లేదా అని తన పార్టీ అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తన స్ట్రైక్ రేట్ మెరుగుపడి, తన కూటమి పనితీరు మెరుగు పడితే, అందులో ఎక్కువ అవకాశాలు ఉంటే, తాను కచ్చితంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు చిరాగ్ పాశ్వాన్.


అయితే ముఖ్యమంత్రి పదవిపై కోరిక గురించి వస్తున్న ఊహాగాలను పాశ్వాన్ తోసిపుచ్చారు. బీహార్‌లో ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదని, ఎన్నికల తర్వాత నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతారని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. అయితే పాశ్వాన్ అభ్యర్థిత్వంపై అధికారికంగా ధృవీకరించనప్పటికీ, పార్టీ తుది పిలుపుకు కట్టుబడి ఉండటానికి తాను సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.


చిరాగ్ పాశ్వాన్ బీహార్ రాజకీయాల్లోకి తిరిగి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు జన్ సురాజ్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ప్రతి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చెప్పారు. చిరాగ్ పాశ్వాన్ ఎన్నికల్లో పోటీ చేస్తే.. అది బీహార్‌కు మంచిదని అన్నారు. అలాగే చిరాగ్ బీహార్ అసెంబ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటే.. రాష్ట్రానికి ఎంతో మంచి చేయొచ్చని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa