ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటి పెర‌ట్లో పెద్ద మొత్తంలో బయటపడ్డ పాములు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 04:45 PM

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపంలోని సిమౌలీ గ్రామంలో ఒళ్లు గ‌గుర్పొడిచే ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ రైతు ఇంటి పెర‌ట్లో వందకు పైగా పాములు ఒక్కసారిగా బయటకు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ అనూహ్య ఘటనతో ఆ గ్రామం ఉలిక్కిపడింది. ప్రాణభయంతో గ్రామస్థులు కర్రలతో కొట్టి 50కి పైగా పాములను చంపేశారు.సిమౌలీ గ్రామానికి చెందిన మహఫూజ్ సైఫీ అనే రైతు ఇంటి పెర‌ట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి మహఫూజ్ తన ఇంటి వాకిలి వద్ద మొదట ఒక పామును చూసి దానిని చంపేశారు. అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న కాంక్రీట్ ర్యాంప్ కింద నుంచి పాములు ఒకదాని తర్వాత ఒకటిగా పెద్ద సంఖ్యలో బయటకు రావడం మొదలుపెట్టాయి. ఈ పాముల గుంపును చూసి మహఫూజ్ కుటుంబంతో పాటు ఇరుగుపొరుగు వారు కూడా భయంతో వణికిపోయారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు కర్రల‌తో కొట్టి 50కి పైగా పాముల‌ను చంపేశారు. వాటిని అక్కడే ఒక గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. తాము అటవీ శాఖ అధికారులకు సహాయం కోసం పలుమార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదని గ్రామస్థులు ఆరోపించారు. అయితే, తమకు సహాయ కోసం ఎటువంటి అభ్యర్థనలు అందలేదని స్థానిక అధికారులు చెప్పడం గమనార్హం. ఈ విషయంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa