పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో దాయాది పాకిస్థాన్కు భారీ నష్టమే జరిగింది పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో అధికారికంగా ప్రకటించిన లక్ష్యాల కంటే కనీసం మరో ఎనిమిది ప్రాంతాలను కూడా టార్గెట్ చేసింది. ఈ విషయాన్ని సాక్షాత్తు పాకిస్థాన్ ప్రభుత్వపు పత్రాలు వెల్లడించడం గమనార్హం. ఆ దస్త్రాల్లోని మ్యాప్స్ ప్రకారం.. పేషావర్, జహంగ్, సింధ్లో హైదరాబాద్, పంజాబ్లోని గుజరాత్, గుజ్రన్వాలా, భవళ్నగర్, అటాక్, చోర్ వంటి నగరాలలోని ఉగ్రవాది శిబిరాలను ధ్వంసం చేసినట్టు చూపుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైన్యం తన అధికారిక ప్రకటనల్లో వీటి గురించి ప్రస్తావించలేదు. వాస్తవానికి పాకిస్థాన్లో భారత్ చాలా లోతైన దాడులు నిర్వహించినట్టు ఈ తాజా డాక్యుమెంట్లు బయటపెట్టాయి
భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ప్రెస్ బ్రీఫింగ్లలో ఎనిమిది అదనపు ప్రాంతాలు (పై పేర్కొన్న నగరాలు) గురించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. అయితే, భారత్ సైన్యం అనుకున్న దానికంటే చాలా లోతుగా దాడులు జరిపినట్టు తాజా పత్రాలు చాటిచెప్తున్నాయి. మే 7న భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం.. ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు సైనిక ఘర్షణలు కొనసాగాయి. ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులను పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోయింది. ప్రతీకారంగా సరిహద్దుల్లోని సైనిక స్థావరాలు, పౌరులపై దాడికి యత్నించడంతో వాటిని భారత్ తిప్పికొట్టింది.
పాక్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను కూల్చివేసి.. దాని వైమానిక స్థావరాలు, రాడార్ సెంటర్లపై విరుచుకుపడింది. పాక్ డాక్యుమెంట్లు భారత్ దాడితో భారీ నష్టం జరిగిందనేది తేటతెల్లమయ్యింది. భారీ నష్టంతోనే పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చి.. కాల్పులు విరమణ ఒప్పందం ప్రతిపాదనలు తీసుకొచ్చింది.
ఇక, పాక్ పత్రాలు భారత్ దాడి ఎంత తీవ్రంగా ఉందో పూర్వాపరాలను బయటపెట్టాయి. ఇప్పటికే మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన ఉపగ్రహ ఫోటోలు ఆపరేషన్ సిందూర్తో పాక్ వనరుల ఏమేరకు ధ్వంసమయ్యాయో స్పష్టంగా తెలియజెప్పాయి. బహావల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురీద్కేలోని , లష్కరే తొయిబా శిక్షణ శిబిరం, ముజఫరాబాద్, కొట్లి, రావల్కోట్, చక్స్వారి, భింబర్, నీలం లోయ, జహ్లమ్, చక్వాల్ తదితర ప్రాంతాలపై దాడిచేసినట్టు భారత్ సైన్యం ప్రకటించింది.
మే 7 తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ ప్రారంభించి.. పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఆ తరవాత, పాకిస్థాన్కు చెందిన 11 ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. నూరు ఖాన్, రఫీక్వి, మురిద్, సుక్కర్, సియాల్కోట్, పస్రూర్, చూనియాన్, సర్గోదా, స్కర్దూ, భోలారి, జాకొబాబాద్ తదితర ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa