ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈబీ-5 వీసాలపై భారతీయుల కన్ను.. ట్రంప్ ఆంక్షలతో గ్రీన్కార్డు కోసం ప్రయత్నాలు

international |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 07:50 PM

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే.. అమెరికాలో ఉండే విదేశీయులపై దృష్టిసారించిన ట్రంప్.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా వీసాలు, గ్రీన్‌కార్డులు, అమెరికా శాశ్వత సభ్యత్వం విషయంలో కఠిన ఆంక్షలువిధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్‌ను ఇటీవల డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చారు. 5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు మన కరెన్సీలో రూ.43 కోట్లుచెల్లించిన వారికి నేరుగా అమెరికాలో శాశ్వత నివాసం కల్పిస్తారు. అయితే ఇది చాలా ఎక్కువ కావడంతో ఇప్పుడు భారతీయులు అంతా ఈబీ-5 వీసాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో ఇది ఒక సురక్షితమైన, ప్రత్యక్ష మార్గంగా ఎన్నారైలు భావిస్తున్నారు.


ఏంటి ఈ ఈబీ-5 వీసా?


ఈ ఈబీ-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్‌ను 1990లోనే అమెరికా తీసుకువచ్చింది. అమెరికాలోని వ్యాపారాల్లో విదేశీయులు పెట్టుబడి పెట్టి.. దాని ద్వారా అక్కడ ఉద్యోగాలు సృష్టిస్తే.. వారికి గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసం) ఇవ్వడమే ఈ ఈబీ-5 వీసా ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యం. అయితే ఈ ఈబీ-5 వీసా పొందాలంటే.. దరఖాస్తుదారులు అమెరికాలోని కొన్ని ప్రత్యేక వ్యాపారాల్లో కనీసం 8 లక్షల డాలర్లు అంటే సుమారు మన భారత కరెన్సీలో రూ.7 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ వ్యాపారాలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండాలి.


ఇలా పెట్టుబడి పెట్టడం వల్ల కనీసం 10 మంది అమెరికా పౌరులకు శాశ్వత ఉద్యోగాలు సృష్టించబడాలి. అలా అయితేనే ఈబీ-5 వీసా పొందేందుకు అర్హులు అవుతారు. అయితే పెట్టుబడిదారులు నేరుగా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు లేదంటే అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం అనుమతి ఉన్న రీజనల్ సెంటర్ల ద్వారా కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ రీజనల్ సెంటర్లు ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టులను చూస్తాయి.


అమెరికా వలస చట్టాలు రోజురోజుకూ కఠినతరం అవుతున్న నేపథ్యంలో.. చాలా మంది భారతీయులు ఈబీ-5 వీసా కోసం దరఖాస్తుచేసుకుంటున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల ప్రకారం.. గత కొన్ని నెలల్లోనే భారతీయ విద్యార్థుల నుంచి ఈబీ-5 దరఖాస్తుల్లో 100 శాతం పెరుగుదల కనిపించినట్లు తెలుస్తోంది. స్టూడెంట్ వీసాలు, వర్క్ వీసాలపై ఆంక్షల భయం, అనిశ్చితి నెలకొనడంతో, నేరుగా గ్రీన్ కార్డ్‌ను పొందేందుకు ఈబీ-5 వీసా ప్రోగ్రామ్ వైపు చూస్తున్నారు.


ఈ ఈబీ-5 వీసా పొందాలంటే 8 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పటికీ.. దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. స్టూడెంట్ వీసాపై వెళ్లి.. చదువుకుని ఉద్యోగం పొంది గ్రీన్ కార్డ్ తెచ్చుకునేలోపు రూ.కోటికి పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ఈబీ-5 వీసా ద్వారా పెట్టుబడి పెట్టిన వ్యక్తితో పాటు.. వారి జీవిత భాగస్వామికి, 21 ఏళ్ల లోపు పెళ్లికాని పిల్లలకు కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది. అంతేకాకుండా అమెరికాలో ఒక వ్యాపారం కూడా ఉండటంతో దానిపై ఆదాయం కూడా వస్తుంది. అమెరికాలో స్థిరపడాలనుకునే కుటుంబాలకు ఇది చాలా మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు.


ఈబీ-5 వీసాలో ఇబ్బందులు


అయితే ఈ ఈబీ-5 వీసా వల్ల లాభాలు ఉన్నప్పటికీ.. కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతీ సంవత్సరం భారత్‌కు సుమారు 700 ఈబీ-5 వీసాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనివల్ల దరఖాస్తులు ఎక్కువగా ఉంటే.. బ్యాక్‌లాగ్‌లు ఏర్పడతాయి. దీంతో వీసా రావడానికి చాలా కాలం పడుదుంది. అదే సమయంలో 8 లక్షల డాలర్లు అంటే పెద్ద మొత్తం కాబట్టి.. మధ్యతరగతి వర్గాలకు ఇది అందుబాటులో ఉండకపోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa