బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబాన్ని చరిత్ర నుంచి తొలగించేందుకు ఆదేశ తాత్కాలిక ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వారి పేర్లను పార్య పుస్తకాల్లోంచి తొలగించిన యూనస్ సర్కారు.. ఇటీవలే కరెన్సీపై ఉన్న వారి ఫొటోలను కూడా తొలగించింది. కొత్త కాయిన్లు, నోట్లను జారీ చేసింది. ఇది చాలదన్నట్లుగా తాజాగా.. బంగబంధు ముజిబుర్ రహ్మాన్కు ఉన్న జాతిపిత బిరుదును కూడా తొలగించింది. అలాగే స్వాతంత్ర్య సమర యోధులు అనే పదానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కౌన్సిల్ యాక్ట్ను సవరించింది.
గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన 15 ఏళ్ల పాలనకు స్వస్తి పలుకుతూ.. దేశం విడిచి పారిపోయారు. ముఖ్యంగా ఇండియా వచ్చి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి షేక్ హసీనా కుటుంబాన్ని చరిత్ర నుంచి తొలగించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ దేశ పాఠ్య పుస్తకాల్లో బంగబంధు ముజిబుర్ రహ్మాన్ ప్రాధాన్య తగ్గించేలా సవరణలు చేపట్టారు. తొలిసారి స్వాతంత్ర్య ప్రకటన చేసింది జియావుర్ రహ్మాన్ అంటూ మార్పులు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ముజిబుర్ చిత్రం ఉన్న కరెన్సీ నోట్ల స్థానంలో కొత్త డిజైన్తో కూడిన నోట్లను ముద్రించారు. జూన్ 1వ తేదీ నుంచి నోట్లను జారీ చేశారు.
అయితే తాజాగా జాతీయ ముక్తిజోద్ధా కౌన్సిల్ (జాముకా) చట్టాన్ని సవరించారు. ఈ సవరణల ద్వారా జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్ అనే పదాలను చట్టం నుండి తొలగించారు. ఇది 1971 స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్రను తగ్గించేందుకు చేసిన చర్యగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సవరణలతో పాటు స్వాతంత్ర్య సమరయోధుడు నిర్వచనాన్ని కూడా యూనస్ సర్కారు మార్చింది. ఇప్పటి నుంచి.. 1971లో స్వాతంత్ర్య పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారిని మాత్రమే స్వాతంత్ర్య సమర యోధులుగా పరిగణిస్తామని ప్రకటించింది.
ముజిబుర్ రహ్మాన్ ప్రభుత్వ సభ్యులు, విదేశాల్లో మద్దతు తెలిపినవారు, స్వాధీన్ బంగ్లా బేతార్ కేంద్రం కళాకారులు, స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు తెలిపిన జర్నలిస్టులు, ఇతరులు ఇకపై "స్వాతంత్ర్య పోరాట సహచరులు"గా మాత్రమే పరిగణించబడతారని పేర్కొంది. ఈ చర్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనస్ సర్కారు తన అధికార పరిధిని మించి వ్యవహరిస్తోందని, ఎన్నికల నిర్వహణకు మాత్రమే పరిమితమై ఉండాల్సిన ప్రభుత్వం చట్ట సవరణలు చేయడం అనుచితమని అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఈ చర్యలు బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాట చరిత్రను పునఃరావిష్కరించేందుకు చేసిన ప్రయత్నంగా భావిస్తున్నారు. మొత్తం మీద ఈ చట్ట సవరణలు బంగ్లాదేశ్ రాజకీయ వాతావరణంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa