పాకిస్తాన్లో గత కొన్ని నెలలుగా కీలక ఉగ్రసంస్థలకు చెందిన అగ్రనేతలు, కీలక నేతలు వరుసగా హత్యలు, అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్లో బహవల్పూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం. ఇటీవల ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ బహవల్పూర్లోని జైషే మహ్మద్ ఉగ్రకార్యాలయంపై దాడి చేయగా.. ఆ దాడి నుంచి అబ్దుల్ అజీజ్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అజీజ్ మృతిపై వస్తున్న వార్తలపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు.
అయితే జైషే మహ్మద్తో సంబంధం ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు మాత్రం అబ్దుల్ అజీజ్ చనిపోయినట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇక అబ్దుల్ అజీజ్ అంత్యక్రియలు బహవల్పూర్లో జరుగుతాయని ప్రకటించినప్పటికీ.. ఈ విషయంపై ఇంకా పాకిస్తాన్ అధికారులు, ఉగ్రసంస్థ అగ్రనాయకుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఇక అబ్దుల్ అజీజ్ మృతదేహంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జైషే మహ్మద్ వర్గాలు మాత్రం ఆయనకు గుండెపోటుతో మరణించినట్లు పేర్కొంటున్నాయి.
భారత్ను బెదిరిస్తూ మౌలానా అబ్దుల్ అజీజ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ బెదిరింపులకు దిగిన కొన్ని రోజులకే అతడు మరణించడం గమనార్హం. భారత్ను సోవియట్ యూనియన్లా.. బాల్కనైజేషన్ (చిన్న చిన్న ప్రాంతాలుగా విభజించడం) చేస్తానని అబ్దుల్ అజీజ్ తీవ్ర హెచ్చరికలకు జారీ చేశాడు. ఈ బాల్కనైజేషన్ అనే పదం బాల్కన్ ద్వీపకల్పం విచ్చిన్నం నుంచి వచ్చింది. సాధారణంగా ఇది జాతి, మత, రాజకీయ విభాగాలతో ముడిపడి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa