వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణ మోసం కేసులో ప్రధాన నిందితుడిగా నిలిచిన బిలియనీర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా, తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన, భారత్ నుంచి తాను పారిపోయిన విషయాన్ని అంగీకరించినప్పటికీ, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగ కాదని స్పష్టం చేశారు.
"నేను దేశాన్ని విడిచిపెట్టాను. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ దొంగతనం చేశానా? అసలు దొంగతనం ఎక్కడ జరిగిందో చెప్పండి!" అంటూ ఆయన ప్రశ్నించారు.
తనపై మనీలాండరింగ్ ఆరోపణలు తప్పుదారి పట్టించిన దుష్ప్రచారమేనని మాల్యా అభిప్రాయపడ్డారు. తాను దేశాన్ని వదిలి వెళ్లినప్పటికీ, అది ఏవైనా నేరాలకు పాల్పడటానికో లేదా వాటి నుంచి తప్పించుకోవడానికో కాదని ఆయన వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం మాల్యా మీద రూ.9,000 కోట్ల మేర బ్యాంకులకు మోసం, మనీలాండరింగ్ కేసులు కొనసాగుతుండగా, ఆయన్ను తిరిగి భారత్కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది. ప్రస్తుతం ఆయన లండన్లో నివసిస్తున్నారు.
మాల్యా తాజా వ్యాఖ్యలు మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు ఆయన్ను ఆర్థిక నేరస్థుడిగా తేల్చే వాదనలు కొనసాగుతుండగా, మరోవైపు మాల్యా మాత్రం తనపై జరిగిన దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటూ, తాను చేసినది తప్పేనని ఒప్పుకునేందుకు సిద్ధంగా లేనట్టు స్పష్టమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa