ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రకు నాంది పలికేలా, యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా, విద్యార్థి దశలోనే యోగా శిక్షణను తప్పనిసరి చేసేలా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది అని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు యోగాను పాఠ్యాంశంగా చేసే అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. యోగాంధ్రా-2025 కార్యక్రమంలో భాగంగా గురువారం అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో శాసనసభ ఉద్యోగులకు యోగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్పీకర్ మాట్లాడారు. ‘ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. ఈ వేడుకల్లో దాదాపు ఐదు లక్షల మంది పాల్గొంటున్నారు. అందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనేలా ఈ నెల 21 వరకూ యోగాంరఽధ-2025 కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ కాలుష్య నియంత్రణకు కృషి చేయాలి’ అని స్పీకర్ పిలుపునిచ్చారు. ఉప సభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ... విద్యార్థి దశ నుండే యోగాను పాఠ్యాంశంగా చేర్చితే మంచి ఫలితాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా చట్టాన్ని రూపొందించే అంశంపై దృష్టి సారిస్తాం అని తెలిపారు. ఆయుష్ శాఖ వైద్యాధికారులు డాక్టర్ రామానందం, డాక్టర్ రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa