ఉక్రెయిన్తో కొనసాగుతున్న సంఘర్షణలో రష్యా దాడుల తీవ్రతను పెంచింది. తమ వాయుసేన స్థావరాలపై ఉక్రెయిన్ దాడులకు ప్రతిగా మాస్కో కఠినంగా స్పందిస్తోంది. గత మూడేళ్ల యుద్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా, ఏకంగా 479 డ్రోన్లు, 20 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడినట్లు కీవ్ వాయుసేన వర్గాలు ధృవీకరించాయి. ఈ దాడులు ప్రధానంగా మధ్య, పశ్చిమ ఉక్రెయిన్లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఆ వర్గాలు తెలిపాయి.రష్యా ప్రయోగించిన ఆయుధాల్లో అత్యధిక భాగం తమ గగనతల రక్షణ వ్యవస్థలు మార్గమధ్యంలోనే కూల్చివేశాయని ఉక్రెయిన్ ప్రకటించింది. మొత్తం 277 డ్రోన్లు, 19 క్షిపణులను నిర్వీర్యం చేసినట్లు పేర్కొంది. కేవలం 10 డ్రోన్లు లేదా క్షిపణులు మాత్రమే నిర్దేశిత లక్ష్యాలను ఛేదించగలిగాయని వెల్లడించింది. సాధారణంగా రష్యా డ్రోన్ దాడులు సాయంత్రం మొదలై తెల్లవారే వరకు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో మాస్కో పౌర నివాసాలపై దాడులకు పాల్పడుతోందన్న విమర్శలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి. ఈ దాడుల కారణంగా ఇప్పటివరకు సుమారు 12,000 మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి.ఉక్రెయిన్పై వైమానిక దాడులను తీవ్రతరం చేయడంతో పాటు, రష్యా తన నౌకాదళాన్ని బలోపేతం చేయడంపై కూడా దృష్టి సారించింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశ నౌకాదళం కోసం రూపొందించిన సరికొత్త వ్యూహానికి ఆమోదముద్ర వేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకాదళంగా రష్యా నేవీని తీర్చిదిద్దడమే ఈ వ్యూహం యొక్క ప్రధాన లక్ష్యమని క్రెమ్లిన్ ప్రతినిధి నికోలాయ్ పత్రుషెవ్ వెల్లడించారు. అయితే, ఈ ప్రణాళికకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన వెల్లడించలేదు.ప్రస్తుతం చైనా, అమెరికా తర్వాత రష్యా మూడో అతిపెద్ద నౌకాదళాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ, ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా నౌకాదళానికి కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. మాస్కో వద్ద ప్రస్తుతం 79 జలాంతర్గాములు ఉండగా, వాటిలో 14 అణుశక్తితో పనిచేసేవి ఉన్నాయి. వీటితో పాటు 222 యుద్ధ నౌకలు కూడా రష్యా అమ్ములపొదిలో ఉన్నాయి. పుతిన్ తాజాగా ఆమోదించిన వ్యూహం ప్రకారం, 2050 నాటికి రష్యా నౌకాదళాన్ని అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa