ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్ సిక్స్ హామీల్లో మరొకటి నెరవేరిందని మంత్రి లోకేశ్ వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 11, 2025, 07:00 PM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ విద్యార్థుల తల్లులకు శుభవార్త అందించింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా 'తల్లికి వందనం' పథకం అమలుకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఆర్థిక సహాయం జమ చేయనున్నట్లు ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల 27 వేల 164 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. వీరి తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం మొత్తం రూ. 8745 కోట్లు జమ చేయనుంది. ఒకటో తరగతిలో కొత్తగా అడ్మిషన్ పొందే చిన్నారులతో పాటు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు.విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు, వారి తల్లులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని గుర్తు చేశారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మెగా డీఎస్సీ ప్రకటన, దీపం-2 పథకాల అమలు దిశగా చర్యలు తీసుకున్నామని, తాజాగా 'తల్లికి వందనం' పథకం అమలుతో మరో ముఖ్యమైన హామీని నిలబెట్టుకున్నామని లోకేశ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ పథకానికి పచ్చజెండా ఊపడం సంతోషకరమని ఆయన అన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa