వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలు నిర్వీర్యమై, లా అండ్ ఆర్డర్ కుప్పకూలినట్లు ఆరోపించారు. రాజకీయ కక్షలతో టీడీపీ నాయకులు నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారని, దీంతో ప్రజలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో తన కాన్వాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ, దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన నిప్పులు చెరిగారు.
పొగాకు రైతులకు కనీస మద్దతు ధరలు లభించకపోవడంతో వారిని పరామర్శించేందుకు పొదిలికి వెళ్లిన తన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి, రాళ్లు విసిరేలా చేశారని జగన్ ఆరోపించారు. సుమారు 40,000 మంది రైతులు, ప్రజలు సంఘీభావంగా తన కార్యక్రమానికి హాజరైనప్పటికీ, టీడీపీ రౌడీలు గలాటా సృష్టించే ప్రయత్నం చేశారని, అయినప్పటికీ ప్రజలు సంయమనం పాటించారని పేర్కొన్నారు. ఈ హింసాత్మక చర్యలకు పాల్పడిన 40 మంది టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోకుండా, రైతులపైనే అన్యాయంగా కేసులు పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
చంద్రబాబు పాలనను రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా ఉందని జగన్ ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా, వారిపైనే ఎదురు కేసులు పెట్టడం చంద్రబాబుకు మాత్రమే చెల్లిందని విమర్శించారు. పొదిలి పర్యటనలో రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం దిగజారుడుతనమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో న్యాయం, శాంతి కోసం పోరాడుతున్న రైతులు, ప్రజల గొంతును అణచివేసే ప్రయత్నాలు సాగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జగన్ తీవ్రంగా ఖండించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa