ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్దవాళ్లను దూరం పెడుతున్నారా.. సర్వేలో ఆసక్తికర వివరాలు

national |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 07:43 PM

వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్‌నెస్ డే సందర్భంగా హెల్ప్‌ఏజ్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వే మన దేశంలో యువత, వృద్ధుల మధ్య సంబంధాలపై పలు కీలక విషయాలను తెలిపింది. యువత, వృద్ధులకు సంబంధించి.. తాజా అధ్యయనంలో ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. చాలా మంది యువకులు.. వృద్ధులను ఒంటరిగా, ఇతరులపై ఆధారపడిన వారిగా చూస్తున్నప్పటికీ.. వారిని తెలివైన వారిగా, గౌరవించదగిన వారిగా కూడా భావిస్తున్నారని తేలింది. ఈ సందర్భంగా ఈ సర్వే యువత, వృద్ధుల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరచేందుకు అవసరమైన కొన్ని కీలక సూచనలను కూడా చేసింది.


ఈ సర్వే రిపోర్ట్ తర్వాత హెల్ప్‌ఏజ్ ఇండియా సీఈఓ రోహిత్ ప్రసాద్ మాట్లాడారు. భారతదేశంలో వృద్ధులకు గౌరవం ఇవ్వడం, కుటుంబ సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఒక సంప్రదాయమని పేర్కొన్నారు. 86 శాతం మంది వృద్ధులు తమకు కుటుంబంలో విలువ ఉందని భావిస్తున్నారని వెల్లడించారు. అయితే చాలామంది వృద్ధులు.. యువతకు దూరంగా, తమ మాట వినేవారు లేరని, ఒంటరిగా ఉన్నామని భావిస్తున్నారని ఆయన వివరించారు. తమకు ప్లాన్లు చెబుతారు కానీ మమ్మల్ని అడగరు అని యువత అంటున్నారనే మాటలు.. వృద్ధుల నుంచి తరచుగా వినపడుతున్నాయని.. ఇది ఆ రెండు తరాల మధ్య ఉన్న ఖాళీని స్పష్టంగా చూపిస్తుందని తెలిపారు. అయితే ఈ ఖాళీని పూడ్చడం చాలా అవసరమని రోహిత్ ప్రసాద్ సూచించారు.


ఈ హెల్ప్ఏజ్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వే దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, కాన్పూర్, నాగ్‌పూర్, మధురై వంటి దేశంలోని 10 కీలక నగరాల్లో నిర్వహించారు. ఈ సర్వేలో మొత్తం 5,798 మంది పాల్గొన్నారు. అందులో 70 శాతం మంది యువకులు (18 నుంచి 30 ఏళ్లు), 30 శాతం మంది వృద్ధులు (60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు) ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా భారతదేశంలో ఉందని.. అదే సమయంలో వృద్ధుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోందని రోహిత్ ప్రసాద్ వెల్లడించారు. వయసుతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొనిపోయే సమాజాన్ని మనం నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. వృద్ధులకు రక్షణ, డిజిటల్ విద్య, జీవితాంతం నేర్చుకోవడం, వాలంటీర్లుగా పనిచేయడం వంటి విషయాల్లో వారికి సహాయం చేయాలని కోరారు.


హెల్ప్‌ఏజ్ పాలసీ రీసెర్చ్ అండ్ అడ్వకేసీ డిపార్ట్‌మెంట్‌ సభ్యురాలు అనుపమ దత్తా మాట్లాడుతూ.. ముఖ్యంగా 18 నుంచి 24 ఏళ్ల వయసు ఉన్న యువకులు తమ తాత, అమ్మమ్మ, నానమ్మలతో బలమైన అనుబంధాన్ని కలిగి ఉంటారని తెలిపారు. ఉమ్మడి కుటుంబంగా కలిసి నివసించే యువతకు ఈ అనుబంధం మరింత ఎక్కువగా ఉంటుందని ఆమె వెల్లడించారు. వేరుగా నివసించే యువకులు.. వృద్ధాప్యం గురించి మరింత సానుకూలంగా ఆలోచిస్తారని వివరించారు. తరాల మధ్య వ్యత్యాసాన్ని యువత అంగీకరిస్తున్నారని.. దాన్ని తగ్గించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారని అనుపమ దత్తా తెలిపారు. వృద్ధాప్యం గురించి అర్థం చేసుకోవడానికి విద్యాసంస్థలు కూడా సహాయం చేయాలని.. వృద్ధ, యువ తరాల మధ్య కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరుకుంటున్నట్లు చెప్పారు.


ఒక నివేదిక ప్రకారం.. భారత్‌లో 60 ఏళ్లు పైబడిన వారు ప్రస్తుతం జనాభాలో 12 శాతం ఉన్నారని.. 2050 నాటికి ఇది 19 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువకుల సంఖ్య 36.5 కోట్లకు పైగా ఉందని తెలుస్తోంది. సర్వేలో 68 శాతం మంది వృద్ధులు.. 69 శాతం మంది యువకులు వృద్ధాప్యం అంటే ఒంటరితనం అనే భావనలో ఉన్నారని తేలింది. 88 శాతం మంది యువకులు.. 83 శాతం మంది వృద్ధులు కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే యువకులు, వృద్ధుల మధ్య మంచి అవగాహన, సమన్వయం ఉండటం చాలా అవసరమని తేల్చి చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa