అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం.. గాల్లోకి ఎగిరిన వెంటనే కుప్పకూలిపోయిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 242 ప్రయాణికుల్లో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటికి రాగా.. ఆ విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ క్యాంటీన్లో ఉన్న 35 మంది మెడికల్ సిబ్బంది కూడా మృతి చెందారు. అయితే విమానం కూలిపోయిన ప్రమాదంలో సీటు 11ఏ లో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ ఘటన 27 ఏళ్ల క్రితం జరిగిన విమాన ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది. ఎందుకంటే ఆ ఘటనలో కూడా 11ఏ సీటులో కూర్చున్న థాయ్ నటుడు, గాయకుడు రువాంగ్సాక్ లోయ్చుసాక్.. ప్రాణాలతో బయపడ్డాడు.
1998 డిసెంబర్ 11వ తేదీన థాయ్ ఎయిర్వేస్ విమానం టీజీ261 దక్షిణ థాయ్లాండ్లో ల్యాండ్ అయ్యే సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 146 మందిలో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ 20 ఏళ్ల రువాంగ్సాక్ లోయ్చుసాక్.. బతికి బయటపడ్డారు. ప్రస్తుతం 47 ఏళ్ల రువాంగ్సాక్ అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం గురించి తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ కూడా 11ఏ సీటులోనే కూర్చున్నాడని తెలిసి తాను షాక్ అయ్యాయని.. తనకు గూస్బంప్స్ వచ్చాయని చెప్పారు. ఈ క్రమంలోనే రువాంగ్సాక్.. ఫేస్బుక్లో తన థాయ్ భాషలో పోస్ట్ పెట్టారు. భారత్లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి.. అతను తాను కూర్చున్న 11ఏ సీటులోనే కూర్చున్నాడని రాసుకొచ్చారు.
రువాంగ్సాక్ తన 1998 నాటి బోర్డింగ్ పాస్ తన వద్ద లేదని.. అయితే అప్పటి వార్తాపత్రిక కథనాల్లో తన సీటు నంబర్, ప్రాణాలతో బయటపడిన వివరాలు నమోదు చేసినట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక ఆ విమాన ప్రమాదం తర్వాత.. రువాంగ్సాక్ కొన్నేళ్ల పాటు ఆ ఘటన తనను వెంటాడిందని.. మానసిక ఆవేదన, సర్వైవర్స్ గిల్ట్ గురించి ఇప్పటికే చాలా సందర్భాల్లో బహిరంగంగా మాట్లాడారు. కొన్ని నివేదికల ప్రకారం.. ఆ ఘటన తర్వాత రువాంగ్సాక్ దాదాపు 10 ఏళ్ల పాటు మళ్లీ విమాన ప్రయాణం చేయలేదని తెలుస్తోంది. ఆ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన తర్వాత తన జీవితాన్ని రెండో జీవితంగా రువాంగ్సాక్ అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎయిరిండియా విపత్తుతో ప్రభావితమైన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇక అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ మృత్యువు నుంచి తప్పించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరచడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ పక్కనే కూర్చున్న రమేష్.. ప్రమాదం జరిగినపుడు విమానం నుంచి బయట పడ్డాడు. తీవ్ర గాయాలు అయినప్పటికీ.. అతడు శిథిలాల నుంచి బయటపడి.. అంబులెన్స్ వద్దకు నడుచుకుంటూ వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే విమానంలో ఉన్న మిగిలిన ప్రయాణికులు అందరూ చనిపోయారని తెలిసినపుడు తాను ఎలా బతికానో తనకే తెలియదని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa