ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీకే సురేశ్‌కు ఈడీ సమన్లు జారీ మనీలాండరింగ్ కేసులో విచారణకు ఆదేశం

national |  Suryaa Desk  | Published : Tue, Jun 17, 2025, 05:25 PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం ఈ సమన్లు పంపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ కేసులో భాగంగా జూన్ 19వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని తమ నోటీసుల్లో ఈడీ అధికారులు సూచించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం  కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు సమాచారం.ఏప్రిల్ నెలలో, ఐశ్వర్య గౌడ అనే మహిళను ఈడీ అరెస్టు చేసింది. ఈమెకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాను పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులకు సన్నిహితురాలినని ఐశ్వర్య గౌడ చెప్పుకుందని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. బంగారం, నగదు, బ్యాంకు డిపాజిట్లపై అధిక లాభాలు ఇప్పిస్తానని చెప్పి ఆమె పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ వ్యవహారంలో డీకే సురేశ్ పేరును ఐశ్వర్య గౌడ దుర్వినియోగం చేసిందని, తాను ఆయన సోదరినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడిందని కూడా ఆరోపణలు వచ్చాయి. తన పేరును కొందరు దుర్వినియోగం చేస్తున్నారని డీకే సురేశ్ గతంలోనే బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం గమనార్హం. ఈడీ అధికారులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కులకర్ణి అనే వ్యక్తి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.ఐశ్వర్య గౌడ, ఆమె భర్త హరీశ్ కేఎన్‌తో పాటు మరికొందరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగానే ఇప్పుడు డీకే సురేశ్‌ను విచారించాలని ఈడీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa