ప్రపంచ ఆర్థిక శక్తివంతమైన దేశాల కూటమి జీ-7 సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాడాలని.. ఈ విషయంలో అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని తక్షణమే విడనాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను జవాబుదారీగా చేయాలని ప్రధాని మోదీ జీ-7 ఔట్రీచ్ సెషన్లో స్పష్టం చేశారు.
ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, స్థిరత్వానికి అతి పెద్ద ముప్పుగా పరిణమించిందని మోదీ తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని రాజకీయ సాధనంగా ఉపయోగిస్తున్నాయని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. "ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను కొన్నిసార్లు బహుమతులతో సత్కరిస్తున్న తీరును మనం చూస్తున్నాము. ఇది అంతర్జాతీయంగా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది. దీన్ని మనం అంతం చేయాలి" అని మోదీ ఉద్ఘాటించారు.
గ్లోబల్ సౌత్ దేశాల ఆందోళనలను జీ-7 మరింత సీరియస్గా పరిగణనలోకి తీసుకోవాలని కూడా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలు, సవాళ్లను జీ-7 దేశాలు అర్థం చేసుకుని, వాటి పరిష్కారానికి ముందుకు రావాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. అలాగే ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ పలు దేశాధినేతలతో ఫలవంతమైన చర్చలు జరిపారు. ముఖ్యంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని, ఆస్ర్టేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్లతో కూడా సమావేషం అయ్యారు.
వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి కలిసి పని చేయడం వంటి అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా భారత్-కెనడా మధ్య సంబంధాల సాధారణీకరణకు కృషి చేస్తూ.. దౌత్య, వాణిజ్య సేవలను మెరుగు పరిచేందుకు కొత్త హైకమిషనర్లను నియమించడానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఇది ఇరు దేశాల మధ్య ఇటీవలి కాలంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో సహాయ పడుతుందని అంతా భావిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రసంగం జీ-7 దేశాలపై ఉగ్రవాదంపై మరింత కఠినంగా వ్యవహరించాలనే ఒత్తిడిని పెంచింది.
మరోవైపు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ దీనిపై స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్టు కూడా పెట్టారు. అందులోనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ వైఖరిని ప్రధానమంత్రి వివరించారని అన్నారు. భయంకరమైన పహల్గాం ఉగ్రదాడిని ఖండించినందుకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ చర్యను వేగవంతం చేయాలని వివరించినట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa