ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం వెదురు సాగును ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది మహిళలను ఈ కార్యక్రమంలో భాగం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 2 వేల మంది మహిళలను ఎంపిక చేసిన అధికారులు, ఈ నెలాఖరు నాటికి మరో 5 వేల మందిని ఎంపిక చేసి వచ్చే నెల నుంచి సాగు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తొలి దశలో అల్లూరి, విజయనగరం, అనకాపల్లి, నంద్యాల, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వెదురు సాగును అమలు చేయనున్నారు. వెదురు మొక్కల పంపిణీ ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయ వనరును సృష్టించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. వెదురు ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉండటం ఈ పథకానికి బలం చేకూర్చింది.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించడంతో పాటు, వెదురు సాగు వల్ల ఉత్పన్నమయ్యే ఉప ఉత్పత్తులతో చిన్న తరహా పరిశ్రమలకు ఊతమివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. శిక్షణ, మొక్కల పంపిణీ, మార్కెటింగ్ సౌకర్యాలను అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం విజయవంతమైతే, రాష్ట్రంలో మరిన్ని జిల్లాలకు దీన్ని విస్తరించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa