తమ అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులను ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించింది. అయితే, ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అమెరికాపై ఇరాన్ అణుశక్తి సంస్థ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ కేంద్రాలపై ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయని పేర్కొంది. అయితే ఈ దాడులతో తమ జాతీయ అణు విధానాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేసింది. దీంతో అణ్వాయుధ అభివృద్ధిపై వెనక్కి తగ్గబోమని ఇరాన్ పరోక్షంగా సంకేతం ఇచ్చింది. కానీ ఈ దాడుల వల్ల ఎంత మేరకు మాకు నష్టం సంభవించిందో మాత్రం వివరించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులపై ప్రకటించిన కొద్ది గంటలకే ఇరాన్ ఈ ప్రకటన వెలువరించడం గమనార్హం.
‘‘ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయి.. మన శత్రువుల కుట్రల పట్ల, కుటిల దాడుల పట్ల, మన యువ శాస్త్రవేత్తలు, కార్యశీలురు వెనకడుగు వేయరు. మన అణుశక్తి పరిశ్రమ అమరుల రక్తంతో కూడిన విజయం. దీన్ని ఎవరూ ఆపలేరు’ అని ఉద్ఘాటించింది. దీంతో ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయేల్కు తాము అణు అభివృద్ధిలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఘాటుగా చెప్పింది.
ఈ దాడుల ద్వారా ఇరాన్ అణు కార్యకలాపాలు గణనీయంగా దెబ్బతిన్నాయా? టెహ్రాన్ ప్రతిస్పందన ఎలా ఉండబోతోంది? అణు మర్ధర్లు అనే పదం వినిపించడం దాడుల పట్ల భావోద్వేగాలకు నిదర్శనమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయేల్- ఇరాన్- అమెరికా దాడులతో నెలకున్న పరిస్థితులు, పరిణామాలు పశ్చిమాసియాలోనే కాదు అంతర్జాతీయంగా భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉంది.
మరోవైపు, ఇజ్రాయేల్కు అమెరికా మద్దతు ఇస్తే ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై దాడులు చేస్తామని హూతీ తిరుగుబాటుదారులు తాజా హెచ్చరించారు. ఇది ప్రాంతీయంగా ఉద్రిక్తతలను పెంచుతోంది. గతంలోనూ హూతీలు అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి ప్రతిగా సంకీర్ణ దళాలు హూతీ స్థావరాలపై దాడులు చేశాయి.
యెమెన్కు చెందిన హూతీ మిలిటరీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సారీ ఒక వీడియోలో ఈ హెచ్చరికలు జారీ చేశారు. ‘ఇరాన్పై దాడులు చేస్తున్న ఇజ్రాయేల్తో అమెరికా జట్టుకడితే.. ఎర్ర సముద్రంలోని అగ్రరాజ్య నౌకలు, యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుంటాం" అని ఆయన అన్నారు. హూతీలకు ఇరాన్ మద్దతు ఇస్తోన్న విషయం తెలిసిందే. గతంలో అమెరికా వాణిజ్య నౌకలను హూతీలు టార్గెట్ చేశారు. దీంతో సంకీర్ణ దళాలు వారిపై దాడులు చేశాయి. యెమెన్ రాజధాని సనాతో పాటు పలు ప్రాంతాల్లోని హూతీ స్థావరాలపై దాడులు జరిగాయి. హూతీల ఆయుధ నిల్వ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ యుద్ధంలో వాషింగ్టన్ జోక్యం చేసుకుంటే అందరికీ ప్రమాదం అని టెహ్రాన్ ఇదివరకే హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa