ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం ఆలయ సమీపంలో బాంబులు, బుల్లెట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 07:33 PM

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం లో కలకలం రేగింది. శ్రీశైలంలో బుల్లెట్లు, బాంబులు దొరకడం సంచలనం రేపింది. శ్రీశైలం ఆలయం సమీపంలోని వాసవీ సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్‌ మీద బాంబులు, బుల్లెట్లు లభ్యమయ్యాయి. 9 పెద్ద సైజు బుల్లెట్లు, 4 చిన్నసైజు బుల్లెట్లతో పాటుగా.. మరో నాలుగు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కొంతమంది స్థానికులు డివైడర్ మీద సంచి ఉండటం గమనించారు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.


స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. సంచిలోని బుల్లెట్లు, బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అయితే బాంబులు, బుల్లెట్లు అక్కడికి ఎలా వచ్చాయనేదీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించే పనిలో ఉన్నారు. అయితే ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలా బాంబులు, బుల్లెట్లు బయటపడటం కలకలం రేపుతోంది. భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. పరమశివుడికి సోమవారం ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేకువజామున నుంచే భక్తుల తాకిడి పెరిగింది. పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు దర్శనం కోసం క్యూలైన్లలో, కంపార్టుమెంట్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలిపివేశారు.


ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం, క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వీఐపీ బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి 3 విడతలుగా దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం భక్తులకు ఉదయం 7:30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు, రాత్రి 9 గంటలకుస్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ క్యూలైన్లలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అల్పాహారం, మంచినీరు, బిస్కట్లు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీశైలం దేవస్థానం అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa