ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ విమానం.. టికెట్ ధర చాలా తక్కువే

international |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 10:26 PM

విమానంలో ప్రయాణించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆ టికెట్ ధరలు చూస్తేనే కళ్లు గిర్రున తిరిగిపోతాయి. విమానం ఎక్కడం అనేది సామాన్యులకు ఎప్పటికీ ఒక కల. ఎప్పటికైనా విమానం ఎక్కాలనే కోరికతో చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడప్పుడూ ఎయిర్‌లైన్ సంస్థలు ఆఫర్లు ప్రకటించి.. తక్కువ ధరకే విమాన టికెట్ అందిస్తే.. కొందరు కొనుగోలు చేసి.. విమానం ఎక్కి ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. కానీ చాలా మంది మాత్రం తాము కూడా విమాన ప్రయాణం చేయాలనే వేచి చూస్తారు. ఇక విమాన టికెట్ల ధరలు అంత ఎక్కువగా ఉండటానికి కారణం.. దాని ఇంధనం, మెయింటెనెన్స్‌కు భారీగా ఖర్చు కావడమే. ఇక ప్రస్తుతం వాహనాల రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. స్కూటీ, బైక్ దగ్గరి నుంచి.. ట్రక్కులు, బస్సులు, రైళ్ల వరకు అన్ని వాహనాలు రోజురోజుకూ ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ విమానం అందుబాటులోకి వచ్చి.. ఎయిర్‌లైన్ చరిత్రలోనే సరికొత్త ట్రెండ్‌కు తెరలేపింది.


బీటా టెక్నాలజీస్ సంస్థకు చెందిన అలియా సీఎక్స్ 300 అనే ఎలక్ట్రిక్ విమానం.. నలుగురు ప్రయాణికులతో కలిసి విజయవంతంగా తన తొలి విమానయానాన్ని పూర్తి చేసింది. ఈ నెల మొదట్లో ఈ అలియా సీఎక్స్ 300 విమానం అమెరికాలోని ఈస్ట్ హాంపటన్ నుంచి జాన్ ఎఫ్ కెన్నెడీ ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులతో ప్రయాణించింది. ఈ విమానం కేవలం 30 నిమిషాల్లో 70 నాటికల్ మైళ్లు అంటే సుమారు 130 కిలోమీటర్లు దూరాన్ని కవర్ చేసిందని అమెరికాకు చెందిన ఫోక్స్ న్యూస్ వెల్లడించింది.


 తక్కువ ఖర్చు, ఎక్కువ సౌకర్యం


అయితే ఈ అలియా సీఎక్స్ 300 విమానం ఎగరడానికి అయిన ఖర్చు కేవలం 8 డాలర్లు అంటే రూ.694 మాత్రమే. అయితే అంతే దూరం ప్రయాణించడానికి ఒక హెలికాప్టర్‌కు ఇంధనం ఖర్చే 160 డాలర్లు అంటే సుమారు రూ.13,885 అవుతుందని అంచనా. పైగా ఈ ఎలక్ట్రిక్ విమానంలో పెద్దగా శబ్దం చేసే ఇంజిన్లు, ప్రొపెల్లర్లు లేకపోవడంతో.. నలుగురు ప్రయాణికులు ప్రయాణం పొడవునా స్పష్టంగా మాట్లాడుకోగలిగారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.


ఇది పూర్తిగా 100 శాతం ఎలక్ట్రిక్ విమానమని.. ప్రయాణికులతో కలిసి ఈస్ట్ హాంపటన్ నుంచి జాన్ ఎఫ్ కెన్నడీకి ప్రయాణించిందని.. బీటా టెక్నాలజీస్ ఫౌండర్, సీఈఓ కైల్ క్లార్క్ వెల్లడించారు. న్యూయార్క్ పోర్ట్ అథారిటీకి, న్యూయార్క్ ప్రాంతానికి ఇది ఒక రకంగా తొలిసారి అని తెలిపారు. 35 నిమిషాల్లో 130 కిలోమీటర్లు ప్రయాణించినట్లు చెప్పారు. ఇక ఈ విమానాన్ని ఛార్జ్ చేసి.. ప్రయాణం పూర్తి చేయడానికి సుమారు రూ.694 మాత్రమే ఇంధన ఖర్చు అయిందని పేర్కొన్నారు. ఇక పైలట్, విమానానికి మాత్రమే ప్రయాణికులు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని.. కానీ ఇది ప్రాథమికంగా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న విమాన ప్రయాణమని.. కైల్ క్లార్క్ స్పష్టం చేశారు.


అలియా సీఎక్స్ 300 అందించే సౌకర్యాలు, సేవల వల్ల ఎలక్ట్రిక్ విమాన ప్రయాణం ప్రయాణికులతో పాటు రోజువారీ ప్రయాణికుల్లో కూడా సక్సెస్ అవుతుందని సదరు కంపెనీ పేర్కొంది. వెర్మోంట్‌లో ఉన్న బీటా టెక్నాలజీస్ సంస్థను 2017లో స్థాపించారు. ఇటీవలే తమ ఎలక్ట్రిక్ విమానాల ఉత్పత్తి, ధృవీకరణ, వాణిజ్యీకరణను వేగవంతం చేయడానికి 318 మిలియన్ డాలర్ల నిధులను ఆ సంస్థ సేకరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa